మూడో విడతలో అత్యధిక ఏకగ్రీవాలైన పుంగనూరు, మాచర్ల పై ఉత్కంఠ .. కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ ఏం చేస్తారు ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతున్న కొద్దీ కొత్త మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతుంది. పంచాయతీ ఎన్నికలలో బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని టిడిపి నేతలు కోర్టు మెట్లు ఎక్కారు. ఇక ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఎస్ఈసికి రిఫర్ చేసింది. దీంతో కోర్టు ఆదేశాలతో ఎస్ఈసి ఏం చేయబోతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలో అత్యధికంగా ఏకగ్రీవాలు..కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేయాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే పలు నియోజకవర్గాలలో ఊహించని విధంగా ఏకగ్రీవాలు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్యధికంగా ఏకగ్రీవాలు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్దకు చేరింది.

579 ఏకగ్రీవాలలో పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలోనే 162 ఏకగ్రీవాలు
పంచాయతీ ఎన్నికలలో మెజారిటీ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయాలని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో మొదటి, రెండవ విడత ఎన్నికలలో భారీగానే ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడో విడతలో కూడా అత్యధికంగా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో మొత్తం 579 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయినట్లుగా సమాచారం. 579 ఏకగ్రీవాలలో 162 ఏకగ్రీవాలు ఈ రెండు నియోజక వర్గాలకు చెందినవే కావడంతో ఈ రెండు నియోజకవర్గాలపై ప్రధానంగా అందరి దృష్టి పడింది .

పుంగనూరులో మూడో విడత 85 పంచాయతీలకు మొత్తం ఏకగ్రీవం , మాచర్లలో 77 కు 74 ఏకగ్రీవం
మూడో విడత పంచాయతీ ఎన్నికలలో జరిగిన ఏకగ్రీవాలలో 28 శాతం పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలకు చెందినవి కావడం గమనార్హం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మూడో విడత 85 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, మొత్తానికి మొత్తం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే గుంటూరు జిల్లా మాచర్లలో మూడో విడత 77 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 74 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఈ అంశంపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కోర్టు మెట్లెక్కింది.

ఏకగ్రీవాల ఎపిసోడ్ నిమ్మగడ్డ కోర్టులో
ఇక కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని తేల్చాలని స్పష్టం చేయడంతో ప్రస్తుతం మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది.
ఇప్పటికే బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలి విడత పంచాయతీ ఎన్నికల సమయంలోనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్న అనుమానంతో, ఏకగ్రీవంగా ప్రక్రియపై జిల్లా కలెక్టర్ లనుండి నివేదిక కోరింది. అప్పటివరకు ఏకగ్రీవాల ప్రకటన ఆపాలని అధికారులను ఆదేశించింది. నివేదికను పరిశీలించిన తర్వాత ఏకగ్రీవాల ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలో పర్యటించనున్న ఎస్ఈసీ
ప్రస్తుతం పుంగనూరు, మాచర్ల ఏకగ్రీవాల విషయంలో కోర్టు ఆదేశాల మేరకు ఏకగ్రీవాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవలసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. పర్యటన తర్వాత ఏకగ్రీవాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications