రాజధానుల కొత్త బిల్లుపై ఉత్కంఠ-హైకోర్టులో ఇంకా పెండింగ్ కేసు-బడ్టెట్ సమావేశాల్లో డౌటే ?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన రెండు బిల్లులు వెనక్కి తీసుకుంది. వాటి స్ధానంలో మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే ఈ కొత్త బిల్లు తీసుకురావాలంటే పాత బిల్లుల రద్దుతో పాటు హైకోర్టులో వీటిపై ఉన్న పెండింగ్ కేసులు కూడా పరిష్కారం కావాల్సి ఉంది. ఇందులో పాత బిల్లుల రద్దు ప్రక్రియ సాఫీగానే పూర్తయినా హైకోర్టులో కేసులు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉండటంతో కొత్త బిల్లుపై ఉత్కంఠ నెలకొంది.
మూడు రాజధానుల సస్పెన్స్
ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని వికేంద్రీకరిస్తూ వైసీపీ ప్రభుత్వం సరిగ్గా రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఏడాదిన్నర క్రితం అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ బిల్లుల్ని గవర్నర్ కూడా ఆమోదించినా హైకోర్టులో మాత్రం చుక్కెదురైంది. వీటిపై విచారణ రెండుసార్లు మొదలై ఆగిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది మరోసారి హైకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. దీంతో పాటు హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు చేస్తున్న ఘాటు వ్యాఖ్యలతో ప్రభుత్వంలో అంతర్మథనం ప్రారంభమైంది. చివరికి ఈ బిల్లుల్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లులు అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందాయి.
కొత్త బిల్లు ఎప్పుడు ?
మూడు రాజధానుల కోసం గతంలో తెచ్చిన రెండు బిల్లుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా మరో కొత్త బిల్లు తీసుకొస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతారని అంతా భావిస్తున్నారు. సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటన ఆధారంగా గత బిల్లుల్లో సాంకేతిక పొరబాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్ది కొత్త బిల్లును ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అయితే ఈ బిల్లు ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారన్న దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. దీనికి ప్రధాన కారణం హైకోర్టులో పెండింగ్ కేసులే.
హైకోర్టులో విచారణ ముగిస్తేనే
హైకోర్టులో మూడు రాజధానులకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం రాజదానుల బిల్లుల్ని వెనక్కి తీసుకుంది. దీంతో రాజధానుల పిటిషన్లపై విచారణ ఆగిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయినా హైకోర్టులో న్యాయ ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. దీంతోపాటు పిటిషనర్లు ఈ విచారణ ఆపడానికి వీల్లేదని హైకోర్టును కోరుతున్నారు. దీంతో ఈ విచారణను ముగించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇప్పటికే ఈ విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడింది.
బడ్జెట్ సమావేశాల్లో కొత్త బిల్లు డౌటే ?
మూడు రాజధానులపై గతంలో తెచ్చిన రెండు బిల్లుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ మాత్రం హైకోర్టులో కొనసాగుతోంది. ఇది పూర్తి కావాలంటే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు న్యాయస్ధానం సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపై వెనకడుగు వేసే ప్రశ్నే లేదని చెబుతోంది. ఇందుకోసం కొత్త బిల్లు తెస్తామంటోంది. దీంతో హైకోర్టు కూడా విచారణ కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో ఈ విచారణ కాస్తా జనవరి 28కి వాయిదా వేశారు. అయితే జనవరి 28న విచారణ ప్రారంభమయ్యాక పిటిషన్లను హైకోర్టు కొట్టేస్తే తప్ప కొత్త బిల్లు తెచ్చేందుకు వీల్లేదు. దీంతో ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ కొత్త బిల్లు రాక అనుమానంగానే కనిపిస్తోంది.