అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి (ఫొటోలు)
విశాఖపట్నం: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన విశాఖపట్నంలోని నాలుగో పట్టణం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రమ్మపేట గ్రామానికి చెందిన తాడి రామకృష్ణ అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలోని శ్రీరామా రెసిడెన్సీలో వాచ్మన్గా పనిచేస్తున్నాడు.
అతనితో పాటు కుమారుడు గురునాయుడు, కోడలు సత్యవతి, వారి పిల్లలు గణేష్ (10), మురళీకృష్ణ (8) నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నారు. గురునాయుడు తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి చ్చి చూడగా తన భార్య ఉలుకు పలుకు లేకుండా మంచంపై పడిపోయి ఉందని గురునాయుడు చెబుతున్నాడు.
మంచినీరు పడితే తాగలేదని, దీంతో అనుమానం వచ్చి పక్క వీధిలో నివాసం ఉంటున్న సత్యవతి అక్కను పిలుచుకుని వచ్చానని చెబుతున్నాడు. విషయం తెలిసిన నాలుగో పట్టణం సిఐ కెవి బాలకృష్ణ, ఎస్ఐ జగన్నాధరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. గురునాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సత్యవతి మరణానికి సంబంధించి ఏ విధమైన ఆధారాలు కూడా లభ్యం కాలేదు. సత్యవతి చాలా కాలంగా అస్తమాతో బాధపడుతోందని, ఆ కారణంగానే ఆమె మరణించి ఉంటుందని గురునాయుడు చెబుతున్నాడు. భర్తే చంపేసి ఉంటాడని సత్యవతి బంధువులు ఆరోపిస్తున్నారు.