సొంత నేతల్నికొంటున్న బాబు, తండ్రిలా జగన్: తలసాని, పవన్పై పోటీ మీద..
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజువారీగా కొనుక్కుంటున్నారని, ఇలాంటి పరిస్థితి ఏ పార్టీలో ఉండదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ఎద్దేవా చేశారు. తన పార్టీ నేతలను తానే కొనుక్కోవడం విడ్డూరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సనత్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెప్పారు. మండలికి పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. తన రాజీనామా ఆమోదం గురించి సభాపతిని అఢగాలన్నారు. రాజీనామాలపై నిర్ణయం ఆయనదే అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు హైదరాబాద్ పార్టీ కార్యాలయ నిర్వహణకు ఒక్క రూపాయి తీసుకోలేదని, కానీ ఇప్పుడు ప్రతిరోజు చంద్రబాబు పంపుతున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీలో బ్లాక్ మెయిలింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. తెరాస పిలుస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేస్తోంటే వారికి కోట్ల రూపాయలు ఇచ్చే దుస్థితికి చేరారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర రావు తనకు మంత్రి పదవి ఇస్తే తెరాసలో చేరుతానని ముఖ్యమంత్రిని కలిశారని ఆరోపించారు.

చంద్రబాబు గతంలో కేసీఆర్ పైన మోత్కుపల్లి నర్సింహులోతో మాట్లాడించి బకరా చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి బకరా అవుతున్నారని విమర్శించారు. ఏపీలో.. వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరించినట్లుగా చేస్తున్నారన్నారు. వైయస్ ఎన్నడూ మైక్ అడగలేదని, స్పీకర్ తనకు మైక్ ఇచ్చే విధంగా కనుసైగతో తన వాళ్లతో పని చేయించే వారని, అదే తరహాలో జగన్ చేస్తున్నారన్నారు.
సనత్ నగర్లో సినిమా హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం పైన కూడా ఆయన స్పందించారు. ఆయన అధికారికంగా ప్రకటిస్తే తాను మాట్లాడుతానని చెప్పారు. తన పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిలను నిలబెట్టినా అభ్యంతరం లేదన్నారు. ఎవరు పోటీ చేసినా కూడా అక్కడ తానే గెలుస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications