టీడీపీ కార్యకర్త కళ్ళలో కారం చల్లి.. ఇనుప రాడ్లతో దాడి; వైసీపీ వర్గీయులపై ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని టిడిపి నేతలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ కార్యకర్తపై ఇనుప రాడ్లతో దాడి
ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ కార్యకర్త కళ్లల్లో కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ శ్రేణులలో ఆందోళనకు కారణమైంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కాకాని యేసు రాజును టార్గెట్ చేసిన ప్రత్యర్థులు అతని కళ్లల్లో కారం చల్లి, పట్టపగలు ఇనుపరాడ్లతో దాడి చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

కళ్ళల్లో కారం చల్లి దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులు
ఆదివారం ఉదయం యేసు రాజు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి లో ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లారు. అక్కడి నుండి మరో ఇద్దరితో కలిసి ద్విచక్రవాహనంపై అలవాల తిరిగివస్తుండగా తురుమెళ్ళ, అచ్చయ్య పాలెం గ్రామాల మధ్య కు రాగానే వైసీపీకి చెందిన 11 మంది ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి, యేసు రాజు పై దాడి చేశారు. అతని కళ్లల్లో కారం చల్లి ఇనుపరాడ్లతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన యేసురాజు అక్కడే వదిలి వారు పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని బాధితుడిని పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

వైసీపీ పనేనని బాధితుడి కుటుంబం ఆరోపణ
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రొంపిచర్ల ఎంపీపీ భర్త, మరికొందరు వైసిపి కార్యకర్తలతో కలిసి తన భర్తపై దాడి చేశారని యేసు రాజు భార్య ఆరోపిస్తోంది. చనిపోయాడు అనుకోని వదిలేసి వెళ్లారని వారు చెబుతున్నారు. టిడిపి నేత అరవింద్ బాబుకు మద్దతు తెలిపినందుకు తమ కుటుంబం పై ఎంపీపీ భర్త వెంకటరావు కక్ష సాధిస్తున్నారని అందుకే యేసు రాజు హతమార్చాలని ప్రయత్నించారని వారు ఆరోపణలు చేశారు.

బాధితుడిని పరామర్శించిన టీడీపీ నేత అరవింద్ బాబు.. వైసీపీ నేతలపై ఆగ్రహం
ఇటీవల యేసు రాజు పై హత్యాయత్నం కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని కూడా వారు ఆరోపించారు. రొంపిచర్ల ఎస్ఐ అండదండలతోనే ఈ దాడికి పాల్పడ్డారని, ఎస్సై పైన కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఈ దారుణ ఘటన నేపథ్యంలో నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు యేసుబాబును పరామర్శించారు. యేసు రాజు కుటుంబ సభ్యులను అడిగి దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చదలవాడ అరవింద్ బాబు, పోలీసులు వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications