పవన్ కల్యాణ్ కోసం చంద్రబాబు ముందు జాగ్రత్త!
అధికార, ప్రతిపక్షాలకు అత్యంత క్లిష్టంగా ఉండబోతున్నాయి రానున్న అసెంబ్లీ ఎన్నికలు. ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఎవరికి వారు పైచేయిగా ఉండేందుకు ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా వీరి వ్యూహాలున్నాయి. విశాఖపట్నంలో జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయి.

దాదాపుగా పొత్తు ఖాయమైనట్లే!
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తాయంటూ మీడియాలో వార్తలు రావడమేకానీ ఎవరూ స్పష్టతివ్వలేదు. కానీ విశాఖ పరిణామాలతో చంద్రబాబు పవన్ ను కలవడం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పనిచేస్తామని ప్రకటించడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కూడా ఖాయమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే 175 నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తల బలం ఉన్న టీడీపీ కొన్నింటిని వదులుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తన బలాన్ని, ఓటింగ్ ను జనసేనవైపునకు మళ్లించాలి.

కొన్నిచోట్ల నామమాత్రపు బాధ్యతలు!
చంద్రబాబు ఇటీవలి కాలంలో తరుచుగా నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో భేటీలు జరుపుతూ వస్తున్నారు. భేటీల్లో భాగంగా కొన్నిచోట్ల ఇన్ ఛార్జిలను ఖరారు చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో సీటువారికేనని, బాగా పనిచేసుకోవాలని చెప్పి పంపేస్తున్నారు. మరికొన్నిచోట్ల మాత్రం సీటు విషయంలో ఎటువంటి హామీ ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించేస్తున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుంది కాబట్టే కొన్నిటికి ఇన్ ఛార్జిలను నియమించలేదని, మరికొన్ని చోట్ల నియమించినా నామమాత్రంగా బాధ్యతలు అప్పగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు?
ఈ తరహా నియోజకవర్గాలేమున్నాయో ఒకసారి పరిశీలిస్తే.. తిరుపతి, తెనాలి, ప్రత్తిపాడు, విజయవాడ పశ్చిమ, భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం, నిడదవోలు తదితర నియోజకవర్గాలున్నాయి. మెరుగ్గా పనితీరు కనపరచలేని ఇన్ ఛార్జిలు, జనసేనకు బలం ఉన్న నియోజకవర్గాలను సమీక్షించిన తర్వాతే చంద్రబాబు ముందుచూపుగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. దీన్ని బట్టి రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించినప్పటికీ పూర్తిగా త్యాగం చేశామనే బాధ అక్కడి శ్రేణుల్లో కలగకుండా చూసుకుంటున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలకు సూచనప్రాయంగా చెబుతూ వారిని కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో 25 సీట్లు కేటాయించే అవకాశం ఉంటుందంటున్నారు. జనసేనకు ఇవ్వాలనుకుంటున్న మొత్తం నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. అప్పటివరకు వేచిచూడక తప్పదు మరి.!!












Click it and Unblock the Notifications