YS Vijayamma : విజయమ్మ రాజీనామా ! టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్- తెరపైకి షాకింగ్ రీజన్!
ఏపీలో వైసీపీ ఆవిర్భావం నుంచి గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ వస్తున్న వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఇప్పుడు అటు తెలంగాణలోనూ కూతురు షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీకి కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉండాల్సిన పరిస్ధితి. దీంతో జనంలో ప్రతికూల సంకేతాలు వెళ్లకుండా ముందే ఆమెను ఆ పదవి నుంచి తప్పించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిని సాకుగా చేసుకుని టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది. అంతే కాదు దీని వెనుక ఓ షాకింగ్ రీజన్ కూడా ఉందని చెబుతోంది.
వైసీపీ ప్లీనరీలో సంచలనాలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. అధికారంలోకి వచ్చాక పార్టీపై సీఎం జగన్ పూర్తిగా దృష్టిసారించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభమయ్యే వైసీపీ ప్లీనరీలో పలు సంచలన నిర్ణయాలు వెలువడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో అధినేత వైఎస్ జగన్, ఆమె తల్లి వైఎస్ విజయమ్మ గురించిన నిర్ణయాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈ ప్లీనరీ కోసం వైసీపీ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
శాశ్వత అధ్యక్షుడిగా జగన్
రేపటి వైసీపీ ప్లీనరీలో పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్టీ నేతలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటివరకూ పార్టీ అధ్యక్షుడిగానే ఉన్న జగన్.. ఇకపై రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించే అవసరం లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా చేయాలనే ఉద్దేశంలో పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో రేపు ఈ ప్రకటన రావడమే ఆలస్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ప్రకటన తర్వాత దీనికి అనుబంధంగా వెలువడే మరికొన్ని ప్రకటనలపైనా చర్చ జరుగుతోంది.
విజయమ్మ రాజీనామా
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ను ప్రకటించడంతో పాటు ఆయన తల్లి, ఇప్పటివరకూ వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మను ఆ పదవికి రాజీనామా చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు సమాచారం ఇచ్చారని, ఆమె స్వయంగా పార్టీ ప్లీనరీలోనే ఈ ప్రకటన చేయొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే వైసీపీతో పాటు వైఎస్సార్టీపీ బాధ్యతలు కూడా ఆమెకు తోడవడటంతో రెండు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం నిబంధనలకు విరుద్ధమనే కారణంగా ఆమెను రాజీనామా చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా విపక్ష టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.
టీడీపీ మైండ్ గేమ్
విజయమ్మ రాజీనామా చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో విపక్ష టీడీపీ అప్పుడే జగన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టేసింది. తన వెంట నడిచేవారిని సీఎం జగన్ నట్టేట ముంచారని టీడీపీ నేత జీవీరెడ్డి ఇవాళ విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలకు వైఎస్ విజయమ్మ వైసీపీ తరఫున ఎన్నో హామీలు ఇచ్చారని , ఆ హామీలు నెరవేర్చ లేదని, దీంతో హామీలు ఇచ్చిన ఆమెను తప్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దీనికి వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అక్కచెల్లెమ్మలంటూ ఆడబిడ్డలనూ ముంచేందుకు జగన్ వెనకాడబోడని జీవీరెడ్డి ఆరోపించారు. అలాగే వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా వైసీపీకి పెద్దదెబ్బ అని న్యాయవాది శ్రవణ్కుమార్ కూడా ఆరోపించారు.
గురువారం సీఎం జగన్ విజయం ప్రజలతో వచ్చింది కాదని, ఆయన గెలుపు వెనుక విజయమ్మ కష్టం ఉందని గుర్తుచేశారు. అధికారం, డబ్బు కోసం తల్లిని దూరం పెట్టడం దారుణమన్నారు. తల్లి, చెల్లికి అన్యాయం చేసినవాడు రాష్ట్రానికి ఏం మంచి చేస్తాడని శ్రవణ్కుమార్ ప్రశ్నించారు.