జగన్ టూర్ వేళ సొంతగడ్డపైనే కౌంటర్ -అమల్లోకి టీడీపీ బిగ్ స్కెచ్ ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ, రేపు కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా పులివెందులతో పాటు ఇడుపులపాయలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో వైఎస్ జగన్ టూర్ కు వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అదే సమయంలో జగన్ కు పోటీగా టీడీపీ కూడా రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో వైసీపీకి సై అంటే సై అనేలా కార్యక్రమాలు చేస్తున్న టీడీపీ తాజా స్కెచ్ జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
జగన్ పులివెందుల టూర్ కు వస్తుండటంతో టీడీపీ మంత్రి సవిత, స్థానిక ఇన్ ఛార్జ్ బీటెక్ రవితో కలిసి "సుపరిపాలన తొలి అడుగు - ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం ప్లాన్ చేశారు. ఇవాళ లింగాల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
పులివెందుల నియోజకవర్గంలోని లింగాల గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో బీసీసంక్షేమ శాఖ మంత్రి, కడపజిల్లా ఇంచార్జ్ మంత్రి సవితతో కలిసి బీటెక్ రవి పాల్గొంటున్నారు.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, జగన్ హయాంలో అప్పులపాలైన రాష్ట్రం బాబు గారి నేతృత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తున్నదన్న నమ్మకం వారిలో నెలకొందని బీటెక్ రవి తెలిపారు. ఏడాది పాలనలో అందించిన తల్లికి వందనం, గ్యాస్, పింఛన్లు పెంపు తదితర పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు అర్హులకు సక్రమంగా చేరుతున్నాయా అని అడిగి బీటెక్ రవి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణి చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ వాదనకు ఆయన నియోజకవర్గం పులివెందులలోనే, అదీ ఆయన పర్యటిస్తున్న సమయంలోనే కౌంటర్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా బీటెక్ రవి, మంత్రి సవిత ఇంటింటి ప్రచారానికి బయలుదేరారు. ఇందులోనూ పథకాలు ఎవరెవరికి ఎలా అందుతున్నాయన్న విషయాలనే వారు ప్రస్తావిస్తున్నారు. తద్వారా జగన్ వాదనకు సొంతగడ్డపైనే కౌంటర్ ఇచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications