ఈ నెలాఖరులో బీజేపీకి గుడ్బై: జేసీ సంచలనం, వాజపేయి టైంలో ఇలా లేదని బాబు అసహనం
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న ప్రస్తుత అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీకి తలాక్ చెబుతామని ఆయన అన్నారు. చంద్రబాబు అలాంటి నిర్ణయానికి వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
ఏం చేయనంటారా, లీకులిస్తారా.. అసెంబ్లీలో అన్నీ చెప్తా: బీజేపీపై బాబు
ఆయన టీవీ ఛానల్తో బుధవారం మాట్లాడారు. ఈ నెలాఖరులోగా బీజేపీకి తాము గుడ్ బై చెప్పే అవకాశముందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కోపం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోదాపై రాహుల్ గాంధీ మాట్లాడారని, కానీ ఆయన మాటలు ఎవరూ నమ్మరన్నారు.
చంద్రబాబుపై మోడీకి అంత ఈర్ష్య ఎందుకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మోడీకి అంత ఈర్ష్య, ద్వేషం ఎందుకో తెలియదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంటు లోపల, బయట నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పైన చూపిన కోపాన్ని ఇప్పుడు బీజేపీపై చూపిస్తున్నారన్నారు. ప్రజలను మోసం చేసేందుకే జగన్ అవిశ్వాసం పెడుతున్నారని, ప్యాకేజీలో చెప్పినవి ఇచ్చి ఉంటే హోదా అడిగేవాళ్లం కాదని అభిప్రాయపడ్డారు.
ఉభయ సభలు వాయిదా
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీల మధ్య రాష్ట్రంలో మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరోవైపు పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. బుధవారం లోకసభ 30 సెకండ్లకే వాయిదా పడింది. రాజ్యసభ కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది.
పల్లె రఘునాథ్ రెడ్డి ఆగ్రహం
తెలుగు ప్రజల ఆశలు ఆడియాశలు చేస్తూ కేంద్రం హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడం చాలా బాధాకరం, దురదృష్టకరమని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం తెలుగు ప్రజలను దగా చేసినట్లే అన్నారు. సైనికులకు కేటాయించిన నిధులను కూడా మీరు అడుగుతారా అని కేంద్రమంత్రి అనడం చాలా బాధాకరమన్నారు. ఇతర రాష్ట్రాలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్నప్పుడు ఏపీకి ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపిందని ఆనాడు మోడీ అన్నారని, ఇప్పుడు బీజేపీ బిడ్డను కూడా చంపేస్తోందన్నారు. ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని అనడం సిగ్గుచేటు అని, ఆ రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా ఏమైనా హామీలు ఇచ్చారా? అన్నారు.
మీరు నిజాలు చెప్పండి
ఇదిలా ఉండగా, మంగళవారం పార్టీ సమన్వయ కమిటీలో చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై గట్టిగా మాట్లాడాలని, ఎవరూ భయపడాల్సిన పని లేదని, కానీ వ్యక్తిగత దూషణలు వద్దని చెప్పారు. ప్రధాని మోడీని అవమానించేలా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని తప్పుబట్టారు. అదే సమయంలో మీడియా పాయింట్ వద్ద బాగా మాట్లాడారన్నారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, వాళ్లు తప్పుడు లెక్కలు చెబితే మీరు నిజాలు చెప్పాలన్నారు.
వాజపేయి హయాంలో ఇలా లేకుండె
ఉపాధి హామీ పథకానికి ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం సరికాదని, ఎక్కువ పనులు చేశాం కాబట్టి, ఎక్కువ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదన్నారు. కేంద్రం న్యాయం చేయకపోయినా అభివృద్ధి ఆగదన్నారు. చట్టబద్దంగా వాళ్లు ఇవ్వాల్సినవి ఇస్తే మరింత వేగవంతంగా అబివృద్ధి చెందుతామన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను కొన్ని విషయాల్లో ఆయనతో విబేధించినా ఆయన మంచిగా తీసుకునే వారని, పరస్పరం నమ్మకంతో పని చేశామని, ఇప్పుటి లాంటి పరిస్థితి ఎదురు కాలేదని పరోక్షంగా మోడీ టైంలో తనకు అలాంటి పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.
జగన్ అప్పుడు కాంగ్రెస్ కంట్రోల్లో, ఇప్పుడు బీజేపీ కంట్రోల్లో
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 20 స్థానాలు గెలుస్తుందని, అప్పుడు హోదా ఇస్తేనే బీజేపీకి మద్దతిస్తామని చెబుతామని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారని టిడిపి నేతలు చెప్పారు. దానిపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కలవమని, ఆ తర్వాత బీజేపీతో జట్టు కడతామని వారు చెబుతున్నట్లేనని, హోదా ఇవ్వవద్దని వాళ్లే చెబుతున్నట్లుగా ఉందని, జైలుకు పోతావంటే జగన్ ఏ ఆట అయినా ఆడుతాడని, అప్పుడు కాంగ్రెస్ కంట్రోల్లో ఉంటే, ఇప్పుడు బీజేపీ కంట్రోల్లో ఉన్నాడన్నారు.