వైసీపీది కాలకేయ రాజ్యం: ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది: చంద్రబాబు ఫైర్..!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. అధికార పార్టీ అక్రమాలు బయట పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇది నాగరిక రాజ్యమా..కాలకేయ రాజ్యమా అని ప్రశ్నించారు. సచివాలయ పరీక్షల లీకేజీ వ్యవహారం పైన చంద్రబాబు మరోసారి స్పందించారు. ఏపీపీఎస్సీ తమకు పరీక్షలతో సంబంధం లేదని చెబుతోందని..దీని పైన స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. యువతకు అన్యాయం చేస్తే సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసారు.
నాగరిక రాజ్యమా..కాలకేయ రాజ్యమా..
ఏపీ ప్రభుత్వం మీద చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చీరాల లో జరిగిన ఘటన పైన ఆయన స్పందించారు. దీని పైన ఆయన ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసారు. వైసీపీ అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఏమిటీ నిరంకుశత్వమని నిలదీశారు. ఇది నాగరిక రాజ్యమా.. కాలకేయ రాజ్యమా.. అంటూ ఫైర్ అయ్యారు. తన ట్వీట్ లో వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారు. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషంగా పేర్కొన్నారు. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా.. పదేపదే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసారు. ఇంతకు ముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారనే విషయాన్ని గుర్తు చేసారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారని ఫైర్ అయ్యారు. ఏమిటీ నిరంకుశత్వం..ఇది నాగరిక రాజ్యమా.. కరడుగట్టిన కాలకేయ రాజ్యమా..అంటూ చంద్రబాబు ట్వీట్లో ప్రశ్నించారు.

యువతకు అన్యాయం చేస్తారా..
ఏపీపీఎస్సీ పరీక్షల లీకేజీ జరిగిందని..దీని పైన మంత్రులు రాజీనామా చేస్తారా..ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని రెండు రోజుల క్రితం ప్రశ్నించిన చంద్రబాబు తిరిగి మరో సారి ప్రభుత్వాన్ని నిలదీసారు. వస్తున్న ఆరోపణల పైన సంబంధిత మంత్రులు..శాఖ ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. 18 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ఏపీపీఎస్సీ తమకు పరీక్షలతో సంబంధం లేదని చెబుతోందని..ఈ గందరగోళానికి కారణం ఎవరని నిలదీసారు. ప్రభుత్వ విజయాలను చూసి తాము ఓర్వలేక పోతున్నామని ఆ పార్టీ నేతలు అంటున్నారని..అంతగా ఓర్వలేని విధంగా ప్రభుత్వం ఏం సాధించదని చంద్రబాబు ఎద్దేవా చేసారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం పైన విచారణ చేయాలని డిమాండ్ చేసారు. యువతకు అన్యాయం చేస్తే సహించేది లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications