రేపు విశాఖకు చంద్రబాబు-అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల టూర్-బిజీ షెడ్యూల్
ఏపీలో ముందస్తు రాజకీయాల కాక రేగుతున్న వేళ పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రేపు విశాఖ వెళ్లనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించబోతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రేపు విశాఖపట్నం వెళుతున్నారు. విశాఖ విమానాశయంలో దిగిన తర్వాత రేపు సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న జిల్లాస్థాయి మినీ మహానాడుకు హాజరవుతారు. 16వ తేదీన అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.
చంద్రబాబు రెండు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్ ను టీడీపీ విడుదల చేసింది. ఇందులో చంద్రబాబు రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి 1.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రెండు గంటలకు ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు చోడవరం వెళతారు. శివాలయం గుడి వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనుల కోసం గతంలో సీఎం హోదాలో తాను ఆవిష్కరించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శిస్తారు. అనంతరం మినీమహానాడు సభా వేదిక వద్దకు వస్తారు. సభలో ప్రసంగించిన అనంతరం ఏడు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 7.45 గంటలకు అనకాపల్లి చేరుకుంటారు. రాత్రికి చంద్రశేఖర కల్యాణ మండలంలో బస చేస్తారు.
గురువారం ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్ మార్కెట్ యార్డు రోడ్డులో నూతనంగా నిర్మించిన టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ కార్యాలయానికి చేరుకొని ప్రారంభిస్తారు. 11 గంటలకు తిరిగి చంద్రశేఖర కల్యాణ మండపానికి చేరుకుంటారు. 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అసెంబ్లీ నియోజవర్గాల వారీగా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి గాజువాక, ఎన్ఏడీ జంక్షన్ మీదుగా విజయనగరం వెళతారు. అక్కడ పార్టీ నేతలతో భేటీ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.