నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు చర్చలు-మోడీ సూచన మేరకు-ఏం చెప్పారంటే ?
ఏపీలో ఐటీ రంగాన్ని తానే అభివృద్ధి చేశానంటూ టీడీపీ అధినేత, మాజీసీఎం చంద్రబాబు చెప్పే మాటలకు ఎంత విలువ ఉందో లేదో తెలియదు కానీ.. నిన్న ప్రధానితో జీ20 సదస్సు సన్నాహక భేటీ సందర్భంగా చంద్రబాబు ఓ కీలక అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో ఆ విషయం ప్రధానిని సైతం ఆకర్షించింది. ఆ తర్వాత చంద్రబాబును నీతి ఆయోగ్ సీఈవోతో కలిసి చర్చించాల్సిందిగా ప్రధాని సూచించారు. దీంతో చంద్రబాబు ఇవాళ నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు.
నిన్న జీ20 సదస్సుపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్పై మాట్లాడారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని ప్రధాని మోడీ చేసిన సూచన మేరకు చంద్రబాబు ఇవాళ నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ డాక్యుమెంట్ పై కీలక సూచనలు చేశారు. నిన్న అఖిలపక్ష భేటీలో చెప్పిన అంశాల్ని ప్రస్తావిస్తూనే డిజిటల్ డాక్యుమెంట్ రూపకల్పనపై సూచనలు చేసినట్లు తెలిసింది.
నిన్న జరిగిన జీ20 సన్నాహక భేటీలో చంద్రబాబు భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ దేశంగా అవతరిస్తుందన్నారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలమన్నారు. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాలన్నారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీతో అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని చంద్రబాబు సూచించారు.