తెలంగాణలో చంద్రబాబునాయుడి ''క్రౌంచ వ్యూహం''!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. రానున్న ఎన్నికల్లో పార్టీకి పట్టున్న జిల్లాలతోపాటు కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే దిశగా ఆయన కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని, తెలుగుదేశం పార్టీని నిలవరించే అవకాశాలు లేకపోవడంతో చంద్రబాబునాయుడు పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు. అందుకు ఆయన మహాభారత యుద్ధంలోని క్రౌంచ వ్యూహాన్ని ఎన్నుకున్నారు. ఈ పద్ధతిలో ''ముక్కు'' భాగంలో ఉండేవారిని జయించడం. ఇలా చేస్తే ప్రత్యర్థులు పూర్తిగా బలహీనపడిపోతారు. తెలంగాణకు ఏపీ నుంచి ముక్కుభాగంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను మొదటిగా టార్గెట్ చేశారు.

ప్రజావ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని..
ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై టీడీపీ దృష్టి సారించింది. భారత రాష్ట్ర సమితి పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందనేది టీడీపీ వర్గాల అంచనా. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని పార్టీ విశ్లేషిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటువేయగా, సెటిలర్లు బీఆర్ఎస్ కు ఓటు వేశారు. భీఆర్ఎస్ పై ప్రజల వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతోపాటు ప్రజల్లో పార్టీపై విశ్వాసం కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది.

గ్రేటర్ హైదరాబాద్ లో కూడా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ బహిరంగసభ పెట్టడానికి టీడీపీ సిద్ధమవుతోంది. కనీ వినీ ఎరగని రీతిలో జనసమీకరణ చేయాలంటూ ఆ బాధ్యతను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగించింది. తెలంగాణ ప్రజలతోపాటు సెటిలర్లుకూడా బీఆర్ఎస్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం.. సాధారణ ప్రజలతోపాటు రాష్ట్రంలోని బీసీ ఓటర్లలో విశ్వాసం కల్పించేదిగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. సభ నిర్వహించే తేదీ ఖరారైన తర్వాత ప్రతిరోజు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు పార్టీ శ్రేణులకు స్పష్టం చేయడంతో వారిలో జోష్ పెరిగింది.

పార్టీని పునరుజ్జీవింపచేయాలని..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 21వ తేదీన బహిరంగసభ నిర్వహించబోతోంది. హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయలుదేరే చంద్రబాబునాయుడు రసూల్ పురా జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం మార్గమధ్యంలో ప్రజలను, నాయకులను కలుస్తూ ర్యాలీగా ఖమ్మం చేరుకుంటారు. దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఖమ్మం సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవానికి ఖమ్మం సభ నాంది పలుకుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఖమ్మం, హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండల్లో సభలుంటాయి. వాటికి కూడా ఖమ్మం తరహాలోనే జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. 2023 ఎన్నికల్లో నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలని టీడీపీ కృషిచేస్తోంది.












Click it and Unblock the Notifications