చంద్రబాబు ఇంటిపై దాడి: వదిలిపెట్టమన్న టీడీపీ రాజ్‌భవన్‌లో ఫిర్యాదు; పోలీసుల సంఘం బహిరంగ చర్చకు వస్తారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకి రక్షణ లేదని, చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న చంద్రబాబు ఇంటి పైన దాడికి పాల్పడటం అందుకు నిదర్శనమని తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక నిన్న ఘటన జరిగిన తరువాత ఏపీ పోలీసుల పై, జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన టిడిపి నేతలు ఈరోజు చంద్రబాబు ఇంటి పైన జరిగిన దాడి పై రాజ్ భవన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చి మరీ గవర్నర్ కార్యదర్శికి టీడీపీ నేతల ఫిర్యాదు
గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో టిడిపి నేతలు గవర్నర్ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించినట్లు సమాచారం . ఇక ఈ రోజు రాజ్ భవన్ కు వెళ్లిన వారిలో బుద్ధ వెంకన్న, వర్ల రామయ్య, అశోక్ బాబు తదితరులు ఉన్నారు. వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడిన దృశ్యాల సీసీటీవీ ఫుటేజీని తెలుగుదేశం పార్టీ నేతలు వినతి పత్రంతో పాటుగా కార్యదర్శికి సమర్పించామని వెల్లడించారు. ఇక ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరుతున్నట్లుగా పేర్కొన్నారు.

 TDP complaint at Raj Bhavan on chandrababu house attack; Varla challenge to police officers association

డీజీపీకి సీఎం జగన్ కు మధ్యలో ఎలాంటి ఒప్పందం ఉందో: మండిపడిన వర్ల
చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిపై గవర్నర్ కు వినతి పత్రం ద్వారా ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు రాష్ట్రంలో తాజా పరిస్థితిపై, వైసిపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులపై మండిపడ్డారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తారని ఉపయోగం ఉండదని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇక డీజీపీకి సీఎం జగన్ కు మధ్యలో ఎలాంటి ఒప్పందం ఉందో తమకు తెలియదని, అందుకే జరిగిన దాడి ఘటనపై గవర్నర్ కార్యదర్శి కి వివరించామని పేర్కొన్నారు. గవర్నర్ దీనిపై దృష్టి పెట్టాలని కోరామని చెప్పారు.

పోలీస్ అధికారుల సంఘం బహిరంగ చర్చకు రావాలని సవాల్
చంద్రబాబు ఇంటికి రావడానికి జోగి రమేష్ కు ఏం పని అని ప్రశ్నించిన టిడిపి నేత వర్ల రామయ్య వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే స్పందించని పోలీసు అధికారుల సంఘం తెలుగుదేశం నేతల వ్యాఖ్యల పైన అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై బహిరంగ చర్చకు రావాలని పోలీస్ అధికారుల సంఘానికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ముందే చెప్పినప్పటికీ, పోలీసులు చంద్రబాబు ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేయక పోవడం వెనుక కారణమేంటో చెప్పాలని ప్రశ్నించారు.

వైసీపీ దాడి అంత తేలిగ్గా వదిలేది లేదన్న టీడీపీ నేతలు
చంద్రబాబు నివాసం దగ్గర వైసిపి సృష్టించిన గొడవ అంత తేలిగ్గా వదిలేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన నేతలు, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుంటే ప్రతిపక్ష పార్టీ నేతలకు రక్షణ లేకుండా పోతుందని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు అనేకమార్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులపై గవర్నర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని గవర్నర్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిపై స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+