సీఎం జగన్ పై టీడీపీ కోర్టులో కేసు : చంద్రబాబు పై కుట్ర చేస్తున్నారు : రాజకీయం వద్దన్న డీజీపీ..!!
తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి జగన్ పైన కోర్టులో ప్రయివేటు కేసు వేయాలని నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పైన అనుమతి లేకుండా డ్రెన్ కెమేరా వినియోగం పైన టీడీపీ ఆందోళన బాట పట్టింది. ఇప్పటికే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.. గవర్నర్ హరిచందన్ ను కలిసారు. చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్ల వినియోగంపై వారు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జగన్ ను ప్రధాన బాధ్యుడిని చేస్తూ ఇదే వ్యవహారంలో కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేయనన్నట్లు పార్టీ ప్రకటించింది. చంద్రబాబు భద్రతకు ముప్పు వాటిల్లేలా వైసీపీ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, డీజీపీ మాత్రం ఈ వ్యవహారంలో ఎటువంటి కుట్ర లేదని..రాజకీయం చేయవద్దని సూచించారు.

సీఎం జగన్ పై కేసుకు నిర్ణయం..
ముఖ్యమంత్రి జగన్ పైన కోర్టులో కేసు దాఖలు చేయాలని ప్రతిపక్ష టీడీపీ నిర్ణయించింది. నాలుగు రోజుల క్రితం కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం పైన ఇద్దరు వ్యక్తులు డ్రోన్ కెమేరా వినియోగించటం పైన టీడీపీ ఆందోళనకు దిగింది. లాఠీచార్జ్ వరకు దారి తీసింది. మంత్రులను సైతం టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. డ్రోన్ కెమేరాలను వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని నిలదీసారు. ఆ ఇద్దరూ తాము ముఖ్యమంత్రి నివాసంలో పని చేసే కిరణ్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమేరా చంద్రబాబు నివాసం పైన వినియోగించామని చెప్పుకొచ్చారు. దీంతో..టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతలంతా కిరణ్ అనే వ్యక్తి ఎవరు ఆదేశించటానికి..ఇది కుట్ర అంటూ ఆరోపణలు చేసారు. ఇదే సమయంలో స్వయంగా ఇరిగేషన్ మంత్రి తామే వరద పరిస్థితి అధ్యయనం కోసం డ్రోన్ కెమేరాలను వినియోగించామని..ఇందులో ఎటువంటి కుట్ర లేదని స్పష్టం చేసారు. దీంతో..ఆ ఇద్దరిని విడిచిపెట్టారు. ఇదే వ్యవహారం మీద ప్రభుత్వాధినేత జగన్ మీద కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు పైన కుట్ర చేస్తున్నారంటూ జగన్ పైన కేసు దాఖలు చేస్తామని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
డ్రోన్ వ్యవహారం పైన టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ను రాజ్భవన్లో కలిసి ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లేఖను గవర్నర్కు అందజేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడాన్ని తెదేపా నేతలు ఈ సందర్భంగా గవర్నర్కు గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పూనుకొంటోందని, డ్రోన్ ఎగరవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్ నివాసంలో ఉండే కిరణ్ ఆదేశాలమేరకే చిత్రీకరించానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని తెదేపా నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇప్పటికే టీడీపీ నేతలు ఇదే వ్యవహారం పైన గుంటూరు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే చంద్రబాబు నివాసాన్ని డ్రోన్ కెమెరాలతో ఎలా ఫోటోలు తీస్తారని టీడీపీ నేతలు అధికారులపై మండిపడుతున్నారు. ఒక మాజీ సీఎం ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీసేముందు అనుమతి తీసుకోరా..టీడీపీ నేతలు అంటూ ప్రశ్నించారు.

కుట్ర లేదు..రాజకీయం చేయద్దు
డ్రోన్ వ్యవహారం పైన డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. లోకల్ పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. ఇందులో ఎటువంటి కుట్రా లేదన్నారు. దీనిని రాజకీయం చేయవద్దని.. ఇకపై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ఇరిగేషన్ అధికారులకు, స్థానిక పోలీసులకు మద్య సమన్వయం లేని కారణంగా ఈ వివాదం నెలకొందని డీజీపీ సవాంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతల ఫిర్యాదులు..వ్యాఖ్యల పైన అధికార వైసీపీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications