తేలు కుట్టిన దొంగలా, బాబును జగన్ పొగడట్లేదు: టీడీపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించాలని ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంగళవారం అన్నారు. రుణమాఫీని కొన్ని రాజకీయ పక్షాలు అభినందిస్తున్నాయని, జగన్ మాత్రం తేలుకుట్టిన దొంగలా మాట్లాడటం లేదన్నారు.
రుణమాఫీ అసాధ్యమని జగన్ చెప్పినా... తాము మాత్రం దాన్ని నిజం చేసి చూపామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. భారీగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, రూ.39,700 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.7,640 కోట్ల డ్వాక్రా రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని చెప్పారు.

ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి లేదన్నారు. వాటితో పాటు రూ.800 కోట్ల మేర చేనేత, ఎస్సీ, ఎస్టీ రుణాలూ మాఫీ అయ్యాయన్నారు. ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభినందించకపోవడం తగదన్నారు.
అప్పట్లో వైయస్ కూడా రైతులకు రుణమాఫీ వద్దన్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. సాధ్యమైనంత తొందరలో రుణమాఫీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే ఆర్థిక వనరుల సేకరణ ఎలా చేయాలనేదానిపై కమిటీ వేశామని మంత్రి చెప్పారు.
పోలీసు శాఖ ప్రక్షాళన: చినరాజప్ప
పోలీసు శాఖను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప బుధవారం అన్నారు. సిబ్బంది కొరత కారణంగా పోలీసులకు వారాంతపు సెలవులు కుదరవన్నారు. త్వరలో ఈ విషయంపై పరిశీలిస్తామన్నారు. ఇసుక తవ్వకాల పైన త్వరలో కొత్త పాలసీ తీసుకు వస్తామని చెప్పారు. రుణమాఫీ నేపథ్యంలో రాష్ట్రం పైన రూ.43వేల కోట్ల భారం పడనుందన్నారు.












Click it and Unblock the Notifications