కొత్త విషయం: పురంధేశ్వరికి డోర్స్ క్లోజ్ చేసిన చంద్రబాబు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఎన్టీ రామారావు కూతురు, మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విషయంలో కొత్త విషయం చెప్పారు. కాంగ్రెసును వీడి ఆమె తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నించారట. అయితే, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమెకు తలుపులు మూసేశారని, దాంతో ఆమె బిజెపిలో చేరారని వర్ల రామయ్య చెప్పారు.
అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడానికి, పోలవరానికి అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని పురందేశ్వరి చేసిన విమర్శపై తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారంనాడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సాధారణంగా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులపై విమర్సలు చేసే విషయంలో టిడిపి నేతలు జాగ్రత్త పడుతుంటారు. కానీ, పురంధేశ్వరి విషయంలో మాత్రం ఆ హద్దులను వారు పాటించడం లేదు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు వర్ల రామయ్య కూడా పురందేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త బిచ్చగత్తె, అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. బీజేపీలో పురందేశ్వరి కొత్త బిచ్చగత్తెలా తయారైందని ఆయన అన్నారు.
పురందేశ్వరికి కనీసం ఇంగితతజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. పోలవరం అంచనా వ్యయం 30 వేల కోట్లకు పైగా ఎందుకు పెరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడడం చేతగాక తమపై నిందలు వేస్తారా అని బుచ్చయ్యచౌదరి ...పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు.
ఇక వర్ల రామయ్య మరో అడుగు ముందుకు వేశారు. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా చేసిన పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని సూచించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన పురందేశ్వరి మొన్నటి ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలోకి దూరేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కానీ తాము తలుపులు తెరవలేదన్నారు.
ప్రవేశం లేదని గట్టిగా తలుపులు మూసేసరికి బీజేపీకి వెళ్లారని వర్ల రామయ్య చెప్పారు. ఇప్పుడు బీజేపీలో తన ఉనికి చాటుకునేందుకు, బీజేపీ అగ్రనేతల దృష్టిలో పడేందుకు ఆమె అవాకులు చెవాకులు పేలుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు. మోడీ, చంద్రబాబు మధ్య స్నేహాన్ని చెడగొట్టేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పురందేశ్వరి బీజేపీలో ఉన్న కాంగ్రెస్ కోవర్ట్ అని ఆరోపించారు.