జనసేన ఆవిర్భావ సభపై టీడీపీ ఫోకస్: పవన్ కల్యాణ్ ప్రసంగంపై: నాగబాబు ఆసక్తికర కామెంట్స్
గుంటూరు: పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ సోమవారం ఆవిర్భావ సభను జరుపుకోనుంది. ఈ సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీన్ని విజయవంతం చేయడానికి పార్టీ అగ్ర నాయకత్వం 12 కమిటీలను ఏర్పాటు చేసింది. సభను విజయవంతం చేయడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని జనసేన భావిస్తోంది. ఆవిర్భావ దినోత్సవ సభ కావడం వల్ల పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి విధానపరమైన ప్రకటనలు ఉండొచ్చనే విషయం చర్చనీయాంశమైంది.
దామోదరం సంజీవయ్య పేరు..
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలో గల ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు కానుంది. రాష్ట్రం నలుమూలల నుంచి మూడు లక్షల మందికి పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికి హాజరయ్యే నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ అగ్ర నాయకత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ బాధ్యతను కమిటీలకు అప్పగించింది. సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేసింది.
విజయవంతానికి కమిటీలు..
జిల్లాల సమన్వయ కమిటీ, ఆహ్వాన కమిటీ, లైజన్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, సభా ప్రాంగణ నిర్వహణ కమిటీ, క్యాటరింగ్ కమిటీ, భద్రత నిర్వహణ కమిటీ, సాంస్కృతిక కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ, వలంటీర్ల కమిటీ, మెడికల్ అసిస్టెన్స్ కమిటీలను అపాయింట్ చేసింది పార్టీ. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సీనియర్ నాయకుడు నాగబాబు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పవన్ ప్రసంగంపై..
కాగా- అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఈ సభ ఏర్పాటు కాబోతోండటం ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో- పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటనలు, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు వెలువడతాయనేది చర్చనీయాంశమైంది. ఆయన ప్రసంగం మీద బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు సైతం ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా జనసేన సభపై దృష్టి సారించింది.
టీడీపీనా..బీజేపీనా..
ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతోంది. ఈ పొత్తు వల్ల రెండు పార్టీలకూ రాజకీయంగా పెద్దగా ఎలాంటి ప్రయోజనం కలగట్లేదనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమౌతోంది. తిరుపతి లోక్సభ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో పొత్తు కోసం ఎదురుచూస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ మరింత బలపడిన నేపథ్యంలో- పవన్ కల్యాణ్ ఇక కమలనాథులతోనే కలిసి సాగడానికి మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఆసక్తికరమైన నాగబాబు ట్వీట్..
కాగా- పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఇన్ని రోజుల తన రాజకీయ జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూశానని, ఎన్నో విపత్తులను ఎదుర్కొని తనను తాను మార్చుకోగలిగానని నాగాబాబు చెప్పుకొచ్చారు. ఈ కష్టాలు, కన్నీళ్లే తనను మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయని పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగిన ఈ దేశానికి, ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలతో..
ప్రజలకు అండగా ఉండాలనే గమ్యం వైపు తాను ప్రయణం సాగించానని గుర్తు చేశారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైన ప్రతిసారి- మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలు, కన్నీళ్లేనని అన్నారు. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని తన గమ్యం చేరుకోవడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నానని నాగబాబు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలతో త్వరలో ప్రజల ముందుకొస్తాను అని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుందంటూ ముగించారు.