కడప కాంట్రాక్టర్.. మంగళగిరి ఎమ్మెల్యే బినామీ?
కోనేరు పునర్నిర్మాణం కోసం కోటిన్నర రూపాయల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నారు.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గాలిగోపురం కలిగిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయ దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కొండపైన పానకాల నరసింహస్వామిని దర్శించుకొని పానకం సమర్పించుకుంటారు. అతి పురాతన దేవాలయంగా లక్ష్మీ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

వార్తల్లో నిలిచిన కోనేరు
ఆలయానికి ఆనుకొనివుండే కోనేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ కోనేరు నుంచి నీటిని తీసుకొని స్వామివారికి అభిషేకం చేయడం కోసం పాండవుల కాలంలో దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తాజాగా ఈ కోనేరు పునర్నిర్మాణం కోసం కోటిన్నర రూపాయల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నారు. కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్ దీని మరమ్మతులు చేపట్టారు. నిధులు దుర్వినియోగమవుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిత్యం ఇక్కడే సంచరిస్తున్నారని, ఆ కాంట్రాక్టర్ ఆళ్లకు బినామీ అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

అడుగు భాగంలో గుప్త నిధులు
నిర్మాణ పనుల్లో భాగంగా నీటిని తోడి, పూడిక తీయాలని నిర్ణయించి ఆ ప్రకారం పనులు జరిపిస్తుండగా కోనేటి అడుగు భాగంలో గుప్త నిధులు ఉన్నాయనే వార్తను ఒకవర్గం తెరపైకి తెచ్చింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో సీసీటీవీ తో భద్రత కల్పించి నిపుణుల పర్యవేక్షణలో ఇంత పురాతన కోనేటికి మరమ్మతులు నిర్వహిస్తే పారదర్శకంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు భక్తులుకున్న అనుమానాలను నివృత్తి చేశారు.

ఎమ్మెల్యే సమాధానం చెప్పడంలేదు
తమ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే ఆళ్ల సమాధానం ఇవ్వడం లేదని, పనులు కూడా పారదర్శకంగా జరగడంలేదని టీడీపీ సీనియర్ నేతలు పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకి దేవి లు మండిపడ్డారు. ఎంతో ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని, అధికారుల తీరు కూడా పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని ఆరోపిస్తున్నారు.
అధికారులు స్పందించి భక్తుల మనోభావాలను గౌరవించాలని పలు ధార్మిక సంస్థలు కోరుతున్నాయి. ప్రశ్నించేవారి గొంతు నొక్కే విధానంలో ప్రభుత్వం కేసులు పెడుతోందనే భయంతో కొందరు భక్తులు బహిరంగంగా వ్యాఖ్యానించడానికి జంకుతున్నారని, వారి గళాన్ని తాము వినిపిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications