పవన్ దెబ్బ, బీజేపీ ఎఫెక్ట్: ఆ లోటును బాబు భర్తీ చేస్తారా? 'జగన్' బలమూ దెబ్బేనా?
అమరావతి: 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద మొత్తంలో సీట్లు వచ్చాయని అంటారు. కృష్ణా జిల్లాలోను పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంది. కేవలం గోదావరి జిల్లాల్లో 33 స్థానాలకు గాను రెండు బీజేపీ, రెండు వైసీపీ మినహా మిగతా సీట్లన్నింటిని టీడీపీ దక్కించుకుంది.
దీనికి టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు పవన్ కళ్యాణ్ మద్దతు కారణమంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి దూరమైన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున టీడీపీ నష్టపోతుందని భావిస్తున్నారు. ఈ లోటును ఎక్కడ పూడ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
బాబుకు సారీ చెప్పను, కేంద్రమంత్రితో టీడీపీ చర్చలు: విజయసాయి, రాజీనామాలు వెనక్కి!
ఈ లోటును అక్కడ పూడ్చగలరా?
సాధారణంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన ఉంది. అందుకు అనుగుణంగానే గత ఎన్నికల్లోను టీడీపీ అధికారం చేపట్టింది. ఇప్పుడు బీజేపీ, జనసేన దూరం కావడంతో టీడీపీపై ఇక్కడ ప్రభావం పడటం ఖాయమని అంటున్నారు. దీనిని కర్నూలు, కడప జిల్లాలతోను పూడ్చుకునే అవకాశముందని అంటున్నారు.
టీడీపీకి మరో చిక్కు
టీడీపీకి మరో చిక్కు కూడా ఉంది. అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు పెరుగుతాయని ఆ పార్టీ భావించింది. అందుకే వైసీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడం, టీడీపీలోను అసంతృప్తితో ఉన్న వారికి సీట్ల సంఖ్య పెరుగుతుందని, అప్పుడు అందరికీ అవకాశం దొరుకుతుందని చెప్పారని అంటారు.
అసంతృప్తులు పెరిగితే
కానీ, ఇప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి చేటు కలిగిస్తుందని భావిస్తున్నారు. అసంతృప్తులు రెబల్గా పోటీ చేసినా చేయవచ్చు. మొదటి నుంచి టీడీపీలో ఉన్న తమకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తే తెలుగు తమ్ముళ్లు, ఇవ్వకుంటే వైసీపీ నుంచి వచ్చిన వారు ఎదురుతిరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇది పెద్ద చిక్కే అని చెబుతున్నారు.
టీడీపీ అక్కడ దృష్టి పెట్టింది
అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం, ఎక్కువ మంది నేతలు వలస రావడం, మరోవైపు బీజేపీ.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దూరమయ్యే నష్టాన్ని టీడీపీ కడప, నెల్లూరు, కర్నూలులో వైసీపీని దెబ్బకొట్టి భర్తీ చేసే అవకాశముందా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీ వైయస్ జగన్ సొంత ఇలాకా కడపపై ప్రత్యేక దృష్టి సారించింది.
టీడీపీకి ఇవి ఇబ్బందే
గత ఎన్నికల్లో టీడీపీకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం పెరిగింది. ఈ బలం పెరగడం కూడా ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిని కలిగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.