Tdp-Janasena: టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో కమిటీ భేటీ-కామన్ అజెండాపై చర్చ !
ఏపీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేన పార్టీలు ఇప్పుడు మ్యానిఫెస్టో తయారీపై దృష్టిసారించాయి. ఇందుకోసం ఇరు పార్టీల నుంచి కొన్ని అంశాలను తీసుకుని ఉమ్మడి మ్యానిఫెస్టోలో పెట్టి ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. దీనిలో భాగంగా టీడీపీ, జనసేన నుంచి ముగ్గురు చొప్పున నేతల్ని మ్యానిఫెస్టో కమిటీకి ఎంపిక చేశారు. వీరు మ్యానిఫెస్టోలో పెట్టే అంశాలపై చర్చించేందుకు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు.
గతంలో టీడీపీ రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారంటీలు ప్రకటించింది. ఇందులో మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు వంటి హామీలు ఉన్నాయి. అలాగే జనసేన కూడా మ్యానిఫెస్టోలో పెట్టేందుకు వీలుగా నాలుగైదు ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. వీటిలో రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల సద్వినియోగం వంటి అంశాలను ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కమిటీ వీటిపై చర్చిస్తోంది.

ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కోసం టీడీపీ, జనసేన నుంచి ముగ్గురేసి నాయకుల చొప్పున తీసుకుని కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఉన్నారు. ఇక జనసేన పార్టీ నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.
ఇవాళ జరుగుతున్న భేటీలో వీరు ఇరు పార్టీల నుంచి వచ్చిన మ్యానిఫెస్టో హామీలపై చర్చించి వీటికి తుదిరూపు తెచ్చే అవకాశం ఉంది. అలాగే తాము ఇచ్చే హామీలపై పరస్పరం అవగాహన ఉండేలా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఇవాళ్టి భేటీలో జరిపే చర్చలు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications