Tdp-Janasena: టీడీపీ-జనసేన ఉమ్మడి మినీ మ్యానిఫెస్టో విడుదల-11 గ్యారంటీలు ఇవే...!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించిన విపక్ష పార్టీలు టీడీపీ-జనసేన ఇవాళ ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోను విడుదల చేశాయి. ఇప్పటికే రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారంటీల మినీ మ్యానిఫెస్టోను టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత జనసేన కూడా కలవడంతో ఇప్పుడు మరో ఆదు గ్యారంటీలు కలుపుకుని మొత్తం 11 గ్యారంటీలతో ఇవాళ ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోగా ప్రకటించారు.
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఉమ్మడి మినీ మ్యానిఫెస్టో వివరాలను ఇవాళ జరిగిన మ్యానిఫెస్టో కమిటీ భేటీ తర్వాత వెల్లడించారు. గతంలో టీడీపీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు.

గతంలో టీడీపీ రాజమండ్రి వేదికగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు వంటి హామీలు ఉన్నాయి.

అంతకు ముందు టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కోసం టీడీపీ, జనసేన నుంచి ముగ్గురేసి నాయకుల చొప్పున తీసుకుని కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఉన్నారు. ఇక జనసేన పార్టీ నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరు ఇవాళ సమావేశమై మ్యానిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు.












Click it and Unblock the Notifications