త్వరలో టీడీపీ-జనసేన జాయింట్ కమిటీ-లోకేష్ ప్రకటన-పవన్ ప్యాకేజీ ప్రచారంపై..
ఏపీలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఇరు పార్టీలతో ఓ జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడిగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే లక్ష్యంతో త్వరలో టీడీపీ-జనసేన ఉమ్మడి యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఇందుకోసం తదుపరి చర్చలు జరుపుతామన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తమను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని లోకేష్ తెలిపారు. తన తల్లిని, తండ్రిని అవమానించారని, భార్య బ్రాహ్మణిపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అందరూ విసిగిపోయారన్నారు. తన తండ్రి చంద్రబాబును జైల్లో పెడితే అక్కడి నుంచే వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ ఎక్కడ, ఎప్పుడు ప్యాకేజీ తీసుకున్నారో ఆధారాలు చూపాలన్నారు. మీ చేతిలోనే ఇంటెలిజెన్స్, సీఐడీ ఉన్నాయని, దర్యాప్తు చేసి ఆధారాలు బయటపెట్టాలని లోకేష్ సూచించారు. వైసీపీ నేతలకు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు.
మరోవైపు జైల్లో చంద్రబాబు ఆరోగ్యం గురించి బాలకృష్ణ స్పందించారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే చంద్రబాబు తపన అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేయాలనే దానిపై చంద్రబాబు-పవన్ ఇవాళ చర్చించారని బాలకృష్ణ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతాయన్నారు.












Click it and Unblock the Notifications