చంద్రబాబు,లోకేష్ నమ్మకద్రోహం...అందుకే వైసీపీలోకి:టిడిపి నేత కన్న బాబు
విశాఖపట్టణం:విశాఖపట్టణం జిల్లాలో టిడిపికి గట్టి షాక్ తగిలింది. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కన్నబాబు వైసీపీలో చేరనున్నారు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తాను గత ఎన్నికల్లో యలమంచిలిలో టీడీపీ విజయం కోసం తీవ్రంగా కృషి చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించానని చెప్పారు. కానీ టీడీపీ మాత్రం తనను చాలా చిన్నచూపు చూసిందని, అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి మోసం చేశారని కన్న బాబు ఆరోపించారు. అలాగే నారా లోకేశ్ కూడా హామీ ఇచ్చి దారణంగా మోసం చేశారన్నారు.
అందుకోసమే వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాని, మే 5 వ తేదీన జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు కన్నబాబు వెల్లడించారు. ఈ విషయంలో భగవంతుడు దిగివచ్చి చెప్పినా వినేది లేదని తేల్చేశారు. వైసిపిలో చేరాక ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకున్నా యలమంచిలి, పాయకరావుపేటలో వైకాపా గెలుపే లక్ష్యంగా పని చేస్తానని కన్నబాబు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో యలమంచిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నబాబు విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మంత్రి కొణతాల హయాంలో హవా సాగించారు. తదనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ని వీడి టిడిపిలో చేరారు. టిడిపిలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ఆశించారు.
అయితే తనకు చంద్రబాబు,లోకేష్ స్వయంగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని, పైగా నియోజకవర్గంలోనూ ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కన్నబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీటికితోడు యలమంచిలి నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆశావాహుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇక తనకు అవకాశం లభించడం దుర్లభమనే ఆలోచనతో ఆయన టిడిపిని వీడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించిన అనంతరం వైసీపీలో చేరేందుకు కన్నబాబు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.