కత్తులతో పొడిచి చంపారు: గుంటూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య
అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు పట్టణంలోని శివారు ప్రాంతమైన ఓబులనాయుడు పాలెంలో తెలుగుదేశం పార్టీకి బీసీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏమినేడి వెంకటేశ్వరరావు(40) గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆయనపై దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో కత్తిపోట్లకు గురైన వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటేశ్వరరావును గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటేశ్వరరావును మంగళవారం తెల్లవారుజామున దుండగులు హత్య చేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు.
వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు అర్బన్ సౌత్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు, సీఐ కె.శ్రీనివాసరావులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications