లోకేష్ కు కరోనా పాజిటివ్ - తనను కలిసిన వారంతా : బాగానే ఉన్నానంటూ ట్వీట్..!!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లుగా లోకేష్ స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. లక్షణాలు కనిపించటంతో పరీక్షలు చేయగా.. కరోనా నిర్దారణ అయిందని తెలిపారు. తనను కలిసిన వారు సైతం పరీక్షలు చేయించుకోవాలని లోకేష్ సూచించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా వెల్లడించారు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని లోకేష్ ఆకాంక్షించారు. గత నెల చివరి వారంలో కుటుంబ సభ్యులతో పాటుగా లోకేష్ విదేశాలు వెళ్లి వచ్చారని చెబుతున్నారు.
సెల్ఫ్ ఐసోలేషన్ లో
అదే విధంగా ఈ మధ్య కాలంలో లోకేష్ పార్టీ పరంగా పర్యటనలు నిర్వహించారు. ప్రతీ ఏటా సంక్రాంతికి చంద్రబాబు తన స్వగ్రామం నారా వారి పల్లెకు కుటుంబ సభ్యులతో సహా వెళ్లేవారు. అయితే, ఈ సారి మాత్రం హైదరాబాద్ లో నే ఉన్నారు. తాజాగా లోకేష్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసారు. కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా విద్యా సంస్థల మూసివేత కొనసాగించాలని ఆ లేఖలో కోరారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కారణంగా విద్యా సంస్థలను మూసి వేసారని.. ఏపీలో విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని లోకేష్ సూచించారు.
అందరూ పరీక్షలు చేయించుకోవాటంటూ
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్కు సెలవులు ప్రకటించాయన్నారు.15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలని..
ఇక, ఇప్పుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లుగా వెల్లడించారు. టీడీపీ నేతలు ఆయన ఆరోగ్యం పైన ఆరా తీస్తున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లుగా లోకేశ్ స్పష్టం చేసారు. అయితే, పండుగ సమయంలో తనతో కలిసి వారంతా త్వరిత గతిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే పలువురు రాజకీయ - సినీ ప్రముఖులు గత వారం రోజుల్లోనే కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లో ఉన్న పలు పార్టీల నేతలకు కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయింది.