14న సీబీఐ వస్తోంది- అందుకే జగన్ తిరుపతి టూర్ రద్దు- టీడీపీ నేత షాకింగ్ రీజన్
హోరాహోరీగా సాగుతున్న తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ఈ నెల 14న పాల్గొనాలని భావించిన సీఎం జగన్ ఆఖరు నిమిషంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాను తిరుపతికి వస్తే జనం భారీగా గుమికూడతారని, అందుకే తాను రావడం లేదని జగన్ క్లారిటీ ఇచ్చారు. అయితే దీని వెనుక మరో షాకింగ్ రీజన్ ఉందంటున్నారు టీడీపీ నేతలు..
సీఎం జగన్ ఈ నెల 14న తిరుపతి పర్యటనకు రాకపోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య బయటపెట్టారు. ఈ నెల 14న తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు పులివెందులకు వస్తున్నారు. ఆ సమయంలో సీఎం జగన్ వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకే వారికి అందుబాటులో ఉండటం కోసమే జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని వర్ల రామయ్య తెలిపారు. ఈ మేరకు తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
"14వ తేదీన తిరుపతి ప్రచారానికి వెళతానన్న ముఖ్యమంత్రి కరోనా వ్యాప్తిస్తుందని తనప్రచారాన్ని వాయిదా వేసుకున్నట్లు, అన్నలారా...తమ్ములారా అంటూ ఒఖ లేఖరాశారని పత్రికలద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి చెప్పిన ఆ కారణం తప్పని నేనంటున్నా. లేఖలో ముఖ్యమంత్రి చెప్పిన కారణం తప్పు. వివేకానందరెడ్డి హత్యకేసులో ముఖ్యమంత్రిని కలవడానికి 14వ తేదీన వస్తున్నామనిచెప్పి, ఎవరైనా సీబీఐ అధికారులు ఆయనతో మాట్లాడారా? మాకొచ్చిన సమాచారం ప్రకా రం ఢిల్లీనుంచి సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారని తెలిసింది. 14వతేదీన సీబీఐ బృందం ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నదనే వార్త బయటకు వచ్చింది. అది నిజమో కాదో ముఖ్యమంత్రి గారే చెప్పాలి." అని వర్లరామయ్య తెలిపారు.