అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు అసాధ్యం ! యనమల కీలక వ్యాఖ్యలు..
అమరావతి : రేపు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ఐదు రోజుల పాటు జరుగుతాయని భావిస్తున్న ఈ సమావేశాల్లోనే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టి ఆమోదిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనవ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజధాని మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిన విషయాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. తాజాగా ప్రభుత్వం మరోసారి మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడుతుందని యనమల ప్రశ్నించారు.
వైసీపీ సర్కార్ ప్రజా సమస్యల్ని వదిలిపెట్టి వ్యక్తిగత అజెండాపై దృష్టిసారిస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా... తిరిగి మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తుండాన్ని యనమల ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదన్నారు.
ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులోనూ పెండింగ్ లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో హైకోర్టు తీర్పును ఉల్లంఘించాలనుకోవడం మూర్ఖత్వమని యనమల తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ పరంగా పెట్టాలి కాబట్టి పెడుతున్నారు తప్ప ప్రజాసమస్యల కోసం కాదన్నారు. అమరావతిపై అవగాహన లేని ఒక్కో మంత్రి ఒక్కో పొంతన లేని ప్రకటన చేస్తున్నారని యనమల విమర్శించారు. దీనిపై చర్చకు టీడీపీ ఎప్పుడూ సిద్ధమేనని యనమల తెలిపారు. చర్చకు రాలేకే వైసీపీ మంత్రులు తమను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ధరల పెరుగుదల, అమరావతి, పోలవరం, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం వంటి అనేక ప్రజాసమస్యలపై ఈ సమావేశాల్లో అసెంబ్లీ, మండలిలో చర్చకు పట్టుబడతామని యనమల తెలిపారు. ప్రజా సమస్యలు లేవనెత్తితే సస్పెండ్ చేస్తామనే ధోరణి ప్రభుత్వానికి సరికాదని యనమల అన్నారు.