బుగ్గన లెక్కలపై యనమల కౌంటర్లు- కాగ్ ప్రశ్నలకు జవాబేదీ ? అప్పులు నిప్పుల కుంపటే..
ఏపీలో ఆర్దిక పరిస్ధితిపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న స్పందించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు గతంలో ప్రభుత్వాలు చేసినదానికంటే తక్కువేనన్నారు. అయినా విపక్షాలు రాద్దాంతే చేస్తున్నాయన్నారు. గతంలో కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గిందని, అందుకే అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. దీనికి ఇవాళ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్దికమంత్రి యనమల కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వాస్తవాలు చెప్పడం మాని పిట్టకథలు చెబుతున్నారని మాజీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కాగ్, కేంద్ర ఆర్ధిక శాఖ అడిని ప్రశ్నాపత్రంకు సమాధానం చెప్పలేక అబద్దాలను వల్లెవేస్తున్నారన్నారు. ఆర్థిక మంత్రి అప్పుల కోసం చేసిన టూర్లను ముగించుకుని రాష్ట్రానికి తిరిగి దర్శనమిచ్చారని యనమల గుర్తుచేశారు. కోవిడ్ తో రాష్ట్రానికి ఆదాయం తగ్గిందనే బుగ్గన మాట పచ్చి అబద్దమని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
2018-19లో పన్నులపై ఆదాయం రూ.56 వేల కోట్లు ఉంటే 2021-22 రూ.73 వేల కోట్లు వచ్చిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. కేంద్ర గ్రాంట్లు 18-19 లో రూ.19 వేల కోట్లు ఉంటే 2021-22 లో రూ.43 వేల కోట్లకు చేరాయన్నారు. తక్కువ మొత్తాలపై శాతం కట్టి వైసీసీ చేసిన అప్పులు తక్కువని చెబుతున్నారని విమర్శించారు.
ఈ రకమైన పరిగణన బహుశా ఆర్థికవేత్తలు ఎవరూ చూసి ఉండరన్నారు. వైసీపీ ప్రభుత్వంత రాబోయే తరాలపైన నిప్పుల కుంపటి లాంటి అప్పులను మూటకట్టి పెడుతున్నారని ఆరోపించారు.
కాగ్ పై, వ్యవస్థలపై తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు విశ్వాసం ఉందని యనమల రామకృష్ణుడు తెలిపారు. సాక్ష్యాత్తు కాగ్ సంస్థ వైసీపీ ఆర్ధిక నిర్వహణ పై విశ్వాసం లేదని చేసిన ఖర్చులను సర్టిఫై చేయమని విస్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తుచేశారు. బహుశా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. కాగ్,కేంద్ర ఆర్థికశాఖ,హైకోర్టులు, సుప్రీంకోర్టులు,సిబిఐ ఇంతవరకూ వైసీపీ ప్రభుత్వ తీరు సమర్థనీయమని ఎక్కడా ఎప్పుడూ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ప్రజలు మీ పాలనపై ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకుని మాట్లాడితే సమంజసంగా ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్వాలిఫైడ్ ఓపినీయన్ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై కాగ్ చేసిన వ్యాఖ్యలు బుగ్గన గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.