అక్కడ కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించాలి .. ఎస్ఈసి నిమ్మగడ్డకు టీడీపీ నేతల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీకి చెందిన కొందరు రాడ్లు, కత్తులు, గొడ్డళ్లతో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో రోడ్లపై స్వైర విహారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండి పడుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం లోక్సభ వైసీపీ అభ్యర్థి అసభ్య పదజాలంతో రెచ్చగొట్టి రౌడీ మూకలను ప్రేరేపిస్తున్నారు అని ఎన్నికలలో ఇతరులు పాల్గొనకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది.
సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్
అధికార పార్టీ నేతల ఆగడాలపై ఎన్నికల కమీషనర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
మొదటి విడత నామినేషన్ల దాఖలులో చివరి రోజున శ్రీకాకుళంలో జరిగిన పలు ఘటనలు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనలపై టిడిపి నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతున్నాయని, టిడిపి బలపర్చిన అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని , నిమ్మాడలో వైసీపీ నేతల చర్యలపై పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు చేశారు.
కేంద్ర బలగాల ద్వారా ఎన్నికలు జరపాలని టీడీపీ విజ్ఞప్తి
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా సజావుగా సాగుతాయి అంటూ వారు ఎన్నికల కమిషనర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ని పరుష పదజాలంతో దూషించారని పేర్కొన్న టిడిపి నేతలు ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే సిఐ ని, డిఎస్పి ని సస్పెండ్ చేయాలంటూ పేర్కొన్నారు. తక్షణం కేంద్ర బలగాలను రంగంలోకి దించి ఎన్నికలను సజావుగా నిర్వహించేలా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ .. టీడీపీ ఫిర్యాదుతో ఉత్కంఠ
పలు గ్రామాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు ఎస్ ఈ సి ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. ఇక ఇదే సమయంలో టిడిపి నేతల ఫిర్యాదు తర్వాత, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ప్రస్తుతం ఉత్కంఠను రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా కలెక్టర్లు జిల్లా ఉన్నతాధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.