కండువా మార్పిళ్ల కక్కుర్తితో చేటు - విశ్వసనీయతకు తూట్లు - జగన్ మనసులో ఏముంది ?
ఏపీ రాజకీయాల్లో విశ్వసనీయత బ్రాండ్ తో జనం మనసులు గెల్చుకున్న జగన్ ఇప్పుడు అదే అంశాన్ని పక్కనబెట్టేశారా ? అధికారం రాక ముందు విశ్వసనీయత గురించి పదేపదే చెప్పిన జగన్, తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్నాయా ? ముఖ్యంగా అవసరం లేకున్నా ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై గుర్రుగా ఉన్న విపక్ష టీడీపీ ఆనాటి ఉపన్యాసాలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నిస్తోంది. దీంతో జనంలోనూ ఇదే చర్చ సాగుతోంది.

ఫిరాయింపులపై వైఖరి మారిందా ?
ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చిన వారిని రాజీనామాలు చేసి రావాల్సిందేనంటూ జగన్ గతంలో ఓ నిబంధన పెట్టారు. దీనికి అనుగుణంగానే అప్పట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మూడు నెలలకే తన ఆరేళ్ల పదవీకాలాన్ని వదులుకుని శిల్పా చక్రపాణిరెడ్డి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసి వచ్చేశారు. దీంతో జగన్ సిద్దాంతాన్ని పాటించిన తొలి ప్రజా ప్రతినిధిగా శిల్పా చక్రపాణిరెడ్డి, ఓ మంచి సంప్రదాయాన్ని అమలు చేసిన పార్టీ అధినేతగా జగన్ జనంలో విశ్వసనీయత సంపాదించారు. కానీ గతేడాది అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ తనకు గతంలో దేశవ్యాప్తంగా విలువలు కలిగిన రాజకీయ నేతగా పేరుతెచ్చిన ఈ సిద్ధాంతాన్ని పక్కనబెట్టేసినట్లే కనిపిస్తోంది.

నేతలకు కండువాలు, ఎమ్మెల్యేలతో భేటీలు..
గత ఏడాది కాలంలో వైసీపీలోకి వచ్చిన టీడీపీ నేతలను, ఎమ్మెల్యేలను గమనిస్తే ఎమ్మెల్యేలు కండువాలు కప్పుకోగా... ఎమ్మెల్యేలు జగన్ తో భేటీకి పరిమితమయ్యారు. వాస్తవానికి ఇద్దరూ వైసీపీకి మద్దతు ప్రకటించేశారు. సీఎం జగన్ దృష్టిలో టీడీపీలో పదవుల్లేని నేతలకు మాత్రమే కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతునిస్తే తమ తప్పేం లేదనేలా కనిపిస్తోంది. కానీ స్ధూలంగా, నైతికంగా చూస్తే ఇదంతా విలువల పతనమే, విశ్వసనీయతకు తూట్లు పొడుకుకోవడమే అనిపించక మానదు.

అవసరం లేని రాజకీయం..
151 సీట్ల అఖండ మెజారిటీతో ప్రజలు ఎన్నడూ లేనంత స్ధాయిలో ఏకపక్షంగా అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షం 23 సీట్లతో నామమాత్రంగా మారిపోయింది. మరో ప్రతిపక్షం జనసేన ఒకే ఒక్క సీటుతో ఉన్నా లేనట్లుగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వ సుస్ధిరత కానీ, రాజకీయంగా ఎలాంటి నష్టం కానీ వైసీపీకి లేదు. కానీ అదే పనిగా విపక్షాన్ని సున్నా చేయడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో గతంలో తాను ప్రవచించిన ఫిరాయింపుల సిద్ధాంతాన్ని జగన్ పూర్తిగా మర్చిపోతున్నారు. పార్టీలోకి వచ్చే వారు తమ సొంత పార్టీలకు రాజీనామాలు చేశారా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు.
Recommended Video

కేసీఆర్ బాటలోనే జగన్ ?
2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్తెసరు మెజారిటీయే దక్కింది. అలాంటి పరిస్ధితుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టీడీపీ చీల్చే అవకాశం ఉందన్న భయాలతో అప్పట్లో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. ఆ తర్వాత విపక్షాలను కకావికలు చేస్తూ అందిన నేతనల్లా పార్టీలో చేర్చేసుకున్నారు. 2019 తర్వాత ప్రజలు మంచి మెజారిటీతో అధికారం ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అదే ఒరవడిని కొనసాగించారు. అవసరం లేకపోయినా కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ లోకి తీసుకుంటూనే ఉన్నారు. దీనంతటికీ కారణం భవిష్యత్ భయాలే. సరిగ్గా ఇప్పుడు జగన్ వ్యవహారశైలి చూస్తున్నా ఎందుకైనా మంచిదన్న భావనే కనిపిస్తోంది. అన్నింటికీ మించి కేసీఆర్ లాగా తాను ఈ వ్యవహారంలో సక్సెస్ అవుతానన్న ధీమా జగన్ లో నానాటికీ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications