రేపు చెప్తా: వంగవీటి రాధాకృష్ణ వద్దకు బాబు రాయబారం, జగన్ గురించి ఏం చెబుతారు?
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్లో ఉంచారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై రేపు వెల్లడిస్తానని ఆయన బుధవారం తెలిపారు. ఆయన వద్దకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతలను పంపించారు.
పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న బాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!
టీడీపీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తారా?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు టీడీ జనార్ధన్, బచ్చుల అర్జునుడు బుధవారం సాయంత్రం వంగవీటి రాధాకృష్ణను ఆయన కార్యాలయంలో కలిశారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సందేశాన్ని ఆయనకు తెలిపారు. టీడీపీలోకి వస్తే ఆయనకు ఇచ్చే పదవులు తదితర అంశాలపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు ఇతర ఆఫర్లు ఉన్నాయని అంటున్నారు.
వంగవీటి సూచనలు చంద్రబాబు దృష్టికి
సమావేశం అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం వంగవీటి రాధాకృష్ణ చేసిన సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన తమ పార్టీలో చేరే అంశంపై రేపు మీడియా సమావేశంలో వెల్లడిస్తారని తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాము వంగవీటిని కలిశామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అధినేత సందేశాన్ని ఆయనకు తెలియజేశామన్నారు. టీడీపీలో చేరే అంశం సహా అన్ని విషయాలు రేపు మీడియాకు చెబుతానని వంగవీటి అన్నారు. దీంతో టీడీపీలో చేరడంతో పాటు, వైసీపీని వీడటానికి గల కారణాలు చెబుతారా, అదే అయితే జగన్ గురించి ఏం చెబుతారనే చర్చ సాగుతోంది.
25న టీడీపీలోకి
కాగా, వంగవీటి రాధాకృష్ణ ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో కృష్ణా జిల్లాలో జగన్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. వంగవీటి చేరికతో విజయవాడ నగరంలో టీడీపీ మరింత బలపడుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఆయన 25వ తేదీన టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.