టీడీపీలో బయటపడ్డ అసంతృప్తి..పార్టీకి దూరంగా సీనియర్లు..?
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా మరోసారి పగ్గాలు చేపట్టారు. అధికారంలోకి వచ్చి 50 రోజుల కాకుండానే కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం స్థానాలు కూటమి గెలుచుకున్నప్పటికి, నేతల మధ్య మాత్రం సఖ్యత కుదరడం లేదట.
ముఖ్యంగా జిల్లా మంత్రి , సీనియర్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అధిపత్యపోరు నడుస్తోందని తెలుస్తోంది. జిల్లాలో టీడీపీ తరుఫున వాసంశెట్టి సుభాష్కు మంత్రిగా అవకాశం దక్కింది. అయితే మంత్రి వాసంశెట్టి సుభాష్పై నాయకులతో , పార్టీ క్యాడర్ సైతం గుర్రుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. వాసంశెట్టి చూట్టు టీడీపీ నాయకుల కన్నా కూడా వైసీపీకి చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని సొంత పార్టీ నేతలు మంత్రిని విమర్శిస్తున్నారు. పైగా వాసంశెట్టి సుభాష్ గతంలో వైసీపీలో పని చేసి ఉండటంతో టీడీపీ సీనియర్ నాయకులెవ్వరూ కూడా ఆయనతో సమావేశం కావడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.

టికెట్ దక్కలేదని సీనియర్ నేత , మాజీ మంత్రి జవహర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంత్రి పదవి దక్కలేదని, రెడ్డి అనంతలక్షి, జ్యోతుల నెహ్రూ మొదలగు ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు పార్టీ క్యాడర్తో వాసంశెట్టి సుభాష్కు ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక టీడీపీ శ్రేణులు సతమతం అవుతున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరి నేతల మధ్య అసంతృప్తిని పార్టీ అధినేత ఎలా పరిష్కరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications