సీయస్ వెనుక ఉన్నదెవరు : టిడిపి టార్గెట్ చేయటం వెనుక కారణమేంటి: ఢిల్లీలో ఎల్వీ సుబ్రమణ్యం..!
ఏపిలో కొత్త వార్ మొదలైంది. రోజు రోజుకీ ముదురుతోంది. మంత్రులు నేరుగా సీయస్ ఎల్వీ సుబ్రమణ్యంను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీని నియమించిన నాటి నుండి ముఖ్యమంత్రి మొదలు మంత్రులు తరచూ విమర్శలు చేస్తున్నారు. అయితే, సీయస్ మాత్రం ఎన్నికల ముందు నిధుల విడుదల గురించి ఆరా తీయటం కలకలం రేపుతోంది. అసలు ఎల్వీ వెనుక ఎవరో ఉండి తమ మీద కుట్ర చేస్తున్నారని టిడిపి ఆరోపణ. ఇంతకీ ఎల్వీ వెనుక ఎవరు ఉన్నారు..ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నారు..
గ్యాప్ పెరుగుతోంది..
ప్రభుత్వంలో మంత్రులు..అధికారులు మధ్యలో వారధిగా సీయస్ కలిస్తేనే పరిపాలన. కానీ, ఇప్పుడు ఎన్నికల వేళ ఏపిలో ఏర్పడిన పరిస్థితులు ఏపిలో కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునీఠాను మార్చి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఎన్నికల సంఘం సీయస్గా నియమించింది. అయితే, తమతో ఏరకంగా సంప్రదింపులు లేకుండా ఎల్వీని ఎలా నియమిస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. ఆయన కోవర్టు..జగన్ కేసుల్లో సహ ముద్దాయి అంటూ ఆరోపించారు. ఇక, ఎల్వీ సుబ్రమణ్యం నాలుగు రోజులుగా చేస్తున్న సమీక్షల పైనా టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధానంగా ఎన్నికల ముందు ఏపి ప్రభుత్వం చేసిని నిధుల సర్దుబాటు..నిధుల విడుదల పైన సీయస్ అధికారులను వివరణ కోరుతున్నారు. ఇది ఏపి మంత్రులకు ఏ మాత్రం రుచించటం లేదు. సీయస్ సైతం క్యాబినెట్కు లోబడి పని చేయాల్సిందేనని..ప్రశ్నించే హక్కు ఆయనకు లేదని చెబుతున్నారు.
ఎల్వీ వెనుక ఉన్నదెవరు..
అసలు..పునీఠా స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరొకరిని నియమించాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ముగ్గురు అధికారుల పేర్లు కోరాల్సి ఉంటుంది. అయితే, సడన్గా ఎల్వీ సుబ్రమణ్యం పేరునే ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవం వెనుక ఎవరు ప్రభావితం చేసారనే కోణంలో టిడిపిలో చర్చ జరుగుతోంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఎల్వీ ని ఎంపిక చేసారని అధికారులు చెబుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రి సమీక్షలకు హాజరు కావద్దంటూ కొందరు అధికారులకు ఎల్వీ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సమీక్షలకు హాజరు కావద్దని చెప్పటాన్ని ప్రభుత్వ పెద్దలు సీరియస్గా తీసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో కీలకమైన వారు స్పష్టమైన లక్ష్యంతోనే ఎల్వీని ఎంపిక చేసి..ఆయనకు అండగా ఉన్నారని టిడిపి అంతర్గత చర్చల్లో అనుమానిస్తున్నారు. లేని పక్షంలో ఇంతగా ఒక విధంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితి ఉండదన్నది వారి అంచనా.
ఢిల్లీలో ఏపి సీయస్..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి కొందరు ముఖ్య అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు సీయస్ ఢిల్లీ పర్యటన పైన టిడిపి నేతలు కన్నేసారు. అధికారిక సమాచారం ప్రకారం సీయస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వారి ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆయన ఏపిలో చేస్తున్న సమీక్షలు..ప్రత్యేకించి ఆర్దిక అంశాల పైన ఆయన చేస్తున్న వ్యాఖ్యలు టిడిపి నేతల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి..నిర్ణయాల పైన కొంత కాలంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు ఏపిలో ఏం జరిగిందనే విషయం తెలుసుకోవటానికి ఎల్వీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని టిడిపి నేతల అనమానం. దీంతో.. ప్రధాన కార్యదర్శి పైన విమర్శలు వస్తున్నా..ఆయన మాత్రం ప్రధానంగా ఆర్దిక శాఖతో సంబంధం ఉన్న అంశాల పైనే ఎక్కువగా సమీక్ష లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఫలితాలకు ముందుగానే మరింతగా ముదిరే అవకాశం కనిపిస్తోంది.