అసెంబ్లీ ఉప నాయకులను ప్రకటించిన టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్న నేపథ్యంలో టీడీపీ శాసన సభ ఉప నాయకులను ప్రకటించింది.టీడీఎల్పీ నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పార్టీ ఉప నాయకులుగా ముగ్గురిని ప్రకటించింది. వీరిలో కే.అచ్చనాయుడు, జీ.బుచ్చయ్య చౌదరీ, నిమ్మల రామానాయుడులను నియమించారు. కాగా డీ. బాలా వీరాంజనేయ స్వామిని పార్టీ విప్గా ప్రకటించారు. ఈ జాబితాకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్ రావు లేఖను ఏపి అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో బుధవారం ఉదయం 11.05 గంటలకు 15వ అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ముందుగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రమాణం చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.
మరుసటీ రోజు మిగిలిన కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. 14న ఉభయసభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. మరోవైపు శాసన మండలి సమావేశాలు కూడా 14 నుంచే ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో జగన్.. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్.. విప్లను సైతం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..