హోదా: నిర్మలా సీతారామన్కు చంద్రబాబు షాకిస్తారా?
విజయవాడ: తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చే అవకాశాలు లేవు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనపై తెలుగుదేశం నాయకులు లోలోన మండిపడుతున్నారు.
దానికితోడు, ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి నేతల మధ్య వాగ్యుద్ధం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ ఎంపిక కావడానికి సహకరించవద్దని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన నిర్మలా సీతారామన్ పదవీ కాలం జూన్లో, కర్ణాటక నుంచి రాజ్యసభకు మూడు సార్లు ఎన్నికైన వెంకయ్య నాయుడి పదవీ కాలం జులైలో పూర్తి కానుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎపి నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులను రాజ్యసభకు తిరిగి ఎంపిక చేయించుకోవాలని బిజెపి అగ్ర నాయకత్వం భావించింది. అయితే, హోదాపై కేంద్ర మంత్రుల ప్రకటనలు చంద్రబాబును తీవ్రమైన చిక్కుల్లో పడేశాయి.

దానికితోడు, రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వడం లేదని, విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా అన్యాయం చేస్తోందని టిడిపి నాయకులు మండిపడుతున్నారు. అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కంటితుడుపు చర్యగా మాత్రమే నిధులు కేటాయించిందని కూడా విమర్శిస్తున్నారు. దీంతో నిర్మలా సీతారామన్ను గానీ, వెంకయ్య నాయుడిని గానీ రాజ్యసభకు పంపిస్తే తమపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బిజెపి నాయకత్వం ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మేలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో వెంకయ్య నాయుడిని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు.
అదే విధంగా నిర్మలా సీతారామన్ను తాము అధికారంలో ఉన్న రాజస్థాన్ లేదా చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించుకునే ఆలోచన బిజెపి నాయకత్వం చేస్తోంది. ఇదే కనుక జరిగితే టిడిపి, బిజెపి మధ్య స్నేహం పూర్తిగా బెడిసికొట్టినట్లేనని భావించవచ్చు.












Click it and Unblock the Notifications