కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే అనిత: పార్టీ పట్టించుకోకపోవడం వల్లే ఈ గతి!..
టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అనకాపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పులో టీడీపీ నాయకులకు సైతం శిక్ష పడటాన్ని ప్రస్తావిస్తూ..
విశాఖపట్నం: టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అనకాపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పులో టీడీపీ నాయకులకు సైతం శిక్ష పడటాన్ని ప్రస్తావిస్తూ.. పార్టీ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు.
అనకాపల్లి సెషన్స్ కోర్టు సంచలనం: మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు జీవిత ఖైదు..
నక్కపల్లి తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. 10ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇప్పుడు టీడీపీకి చెందిన 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో వున్న నాయకుల్లో వెంకటేష్, బొల్లం బాబ్జీ తనకు సోదరుల్లాంటి వారని, మీ కంటే నాకే ఎక్కువ బాధ ఉందని కన్నీటి పర్యంతమయ్యారు.
సెషన్స్ కోర్టు తీర్పు:
కాగా, 2007లో బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీ ఏర్పాటు సమయంలో జరిగిన మత్స్యకారుడి హత్యకు సంబంధించి అనకాపల్లి సెషన్స్ కోర్టు మాజీ ఎమ్మెల్యే చెంగల్రావు సహా మరో 15మందికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. మరో ఐదుగురికి జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
టీడీపీ నాయకులను కాపాడుకోవాలి:
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కోర్టు ఇచ్చిన తీర్పుపై కామెంట్ చేయలేమని, కానీ వారిని కాపాడుకోవడానికి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అన్నారు. ఇటువంటి సమయంలో పార్టీలో కార్యకర్తలు, నేతలంతా సమిష్టంగా ఉండాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ పనికిరాని గొడవలు సృష్టించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వెంట ఉన్న నాయకులను నట్టేట ముంచారని ఆరోపించారు. అదే సమయంలో పార్టీ పట్టించుకోకపోవడంలో ఇలాంటి దుస్థితి వచ్చిందని, ఇలాగైతే భవిష్యత్తులో రాజకీయాలు ఎలా చేయాలని అనిత వాపోయారు.
సీఎం సహాయం కోరుతాం:
విశాఖలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్న నాయకుల కుటుంబ సభ్యులను సీఎం వద్దకు తీసుకెళ్తానని అనిత అన్నారు. దీనిపై అధినేత చంద్రబాబు పరిష్కారం చూపించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ సభ్యులు కొండబాబు, రాగిని వెంకట రమణ, మండల పరిషత్ చీఫ్ అడ్వయిజర్ బాబ్జీరాజు, మాజీ ఎంపీపీ దేవర సత్యనారాయణ సహా తదితరులు పాల్గొన్నారు.
పదేళ్ల సుదీర్ఘ విచారణ:
బీఎంసీ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో జరిగిన ఘర్షణపై పదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం అనకాపల్లి సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 20మందిని దోషులుగా తేల్చగా.. ఇందులో చాలావరకు టీడీపీ సభ్యులు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే చెంగల వెంకట్రవ్ ను నమ్ముకుని టీడీపీ నాయకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.