దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు: సోము వీర్రాజుకు బుచ్చయ్య సవాల్
రాజమండ్రి: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనపై పోటీ చేసి విజయం సాధించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. కనీసం వార్డు మెంబర్గా కూడ సోము వీర్రాజు విజయం సాధించడని ఆయన అభిప్రాయపడ్డారు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇటీవల కాలంలో టిడిపిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో టిడిపి నేతలు కూడ బిజెపి నేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు.
ఆదివారం నాడు రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభ కోసం సోము వీర్రాజు బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
పట్టిసీమపై సోము వీర్రాజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని తెలుగు ప్రజలు బిజెపిని ఓడించనున్నారని ఆయన జోస్యం చెప్పారు.
మోడీ, అమిత్షాలు నియంతలా వ్యవహరిస్తున్నారని బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి ఇచ్చిన హమీలను బిజెపి అమలు చేయలేదని చెప్పారు. ఈ కారణంతోనే ఎన్డీఏ నుండి తాము బయటకు వచ్చామని ఆయన చెప్పారు.