అదంతా నిజం కాదు: దెబ్బకు చంద్రబాబు వద్దకు ఎమ్మెల్యేల క్యూ!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎమ్మెల్యేలకు, మంత్రులకు గ్రేడ్లు ఇచ్చారు. ఇవి కలకలం రేపిన విషయం తెలిసిందే. తక్కువ ర్యాంకులు వచ్చిన నేతలు ఇప్పుడు ఆయనను కలిసి వివరణ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. తాము ఎలాంటి తప్పులు చేయలేదని చెబుతున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారికి క్లాస్ తీసుకుంటున్నారని సమాచారం. తప్పులు దిద్దుకొని సరిగా నడుచుకోవాలని సూచిస్తున్నారని సమాచారం. సీల్డ్ కవర్లో చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు చూసి పలువురు నేతలు కలవరపడుతున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు మరింత కంగారుపడి, వివరణ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ వర్క్ షాప్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇంచార్జులకు ర్యాంకులకు చెందిన సీల్డ్ కవర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వారి పనితీరుకు గ్రేడ్లు కూడా కేటాయించారు.
పలువురు ఎమ్మెల్యేలకు గ్రేడ్ల విషయంలో పెద్దగా టెన్షన్ లేదని, కానీ తమ గురించి పేర్కొన్న సమాచారం విషయమై మాత్రం ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. అవినీతి, దందాలు, ఇసుక తవ్వకాలలో అక్రమాలు.. తదితర సంబంధాలు ఉండటంతో కొందరు ఆందోళన చెంది, వివరణ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది.
నివేదికలో పేర్కొన్న అంశాల్లో నిజం లేదని, తమకు సంబంధం లేని విషయాలు ఉన్నాయని, అలాంటి పొరపాట్లేవీ తాము చేయలేదని చెబుతున్నారట. వారు చెప్పింది వింటున్న చంద్రబాబు ఆ తర్వాత సూచనలు, సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది.
తప్పులు చేసి ఉంటే సరి చేసుకోవాలని, ప్రతి మూడు నెలలకోసారి ఇటువంటి సమాచార సేకరణ జరుగుతుందని చెప్పారని తెలుస్తోంది. తప్పులు ఒక్కోసారి మనకు కనిపించవని, ఎదుటు వారికి కనిపిస్తాయని చెబుతున్నారని తెలుస్తోంది.
అంతేకాదు, తన కుప్పం నియోజకవర్గం విషయంలోను స్వయంగా వ్యతిరేకంగా నివేదిక వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారట. అయితే తాను ఇతరులకు బాధ్యతలు అప్పగించాని, వారి వల్ల పొరపాట్లు జరిగాయని నివేదిక వచ్చిందని చెబుతున్నారని తెలుస్తోంది. నేను కూడా ఇలాంటివి సరి చేసుకోవాలని చెబుతున్నారని సమాచారం.