టెన్త్ పరీక్షల రద్దు, విద్యార్ధుల పాస్- జగన్కు లోకేష్ మరో రిక్వెస్ట్ లెటర్
ఏపీలో కోవిడ్ కల్లోలం నేపథ్యంలో పదో తరగతి పరీక్షల రద్దు కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇవాళ ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. సీఎం జగన్కు రాసిన లేఖలో వెంటనే పరీక్షలు రద్దు చేసి విద్యార్ధులను పాస్గా ప్రకటించాలని మరోసారి కోరారు. గతంలో తక్కువ కేసులు ఉన్నప్పుడు పరీక్షలు రద్దు చేశారని జగన్కు ఆయన గుర్తుచేశారు.
మరో మూడు వారాల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేసి విద్యార్ధులందరినీ పాస్ చేయాలని నారా లోకేష్ సీఎం జగన్కు రాసిన లేఖలో కోరారు. పొరుగున ఉన్న తెలంగాణ సహా దేశంలో మరో 12 రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దు చేశాయని జగన్కు లోకేష్ గుర్తు చేశారు. పలుమార్లు విద్యార్ధులు, తల్లితండ్రులతో నిర్వహించిన ఆన్లైన్ సమావేశాల్లో కోవిడ్ భయాలతో ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తన దృష్టికి తెచ్చారన్నారు.
గతంలో రాష్ట్రంలో ఐదు వేల కరోనా కేసులు ఉన్నప్పుడు పదోతరగతి పరీక్షలు రద్దుచేశారని, కానీ ఇప్పుడు 2 లక్షల కేసులున్నా పరీక్షలు రద్దు చేయకపోవడాన్ని లోకేష్ తప్పుబట్టారు. వేలాది కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకావడం ఎంతో ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. హైకోర్టు లేదా ప్రతిపక్ష నాయకుల ఆందోళనతో కాకుండా మానవత్వంతో ఆలోచించి వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించాలని లోకేష్ జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.