ఆ ముగ్గురి అరెస్టు, కస్టడీ విచారణ..డీజీపీకి రఘురామ హింట్..!
ఏపీలో గతంలో వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న తనను అరెస్టు చేసి సీఐడీ కస్టడీలో హింసించిన వ్యవహారాన్ని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంత తేలిగ్గా మర్చిపోయేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై చర్చలు తీసుకోవాలని కోరుతూ తాజాగా ఫిర్యాదు చేయడంతో పాటు కేసు నమోదయ్యేలా చేసిన రఘురామ.. ఇప్పుడు అందులో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేసి కస్డడీలో విచారించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
గతంలో ఎంపీగా ఉన్న తనను కిడ్నాప్ చేసి చంపాలని చూసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనితకు, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ విచారణ అధికారికి ఇస్తానని, ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకూ నిందితుల్ని బయటకు వదలొద్దని ఆయన కోరారు. వారిని తక్షణం అరెస్టు చేసి కస్డడీలో విచారించాలన్నారు. అలాగే సాక్షులకు రక్షణ కల్పించాలని కూడా రఘురామ సూచించారు.

మరోవైపు తనకు వైద్యం అందించిన అప్పటి డాక్టర్లపై ఒత్తిళ్లు లేకుండా చూడాలని కూడా రఘురామ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో హైకోర్డు జడ్జి సమక్షంలో డాక్టర్లు తనకు పరీక్షలు చేసి వేలు విరిగినట్లు నివేదిక ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఆధారాలు ఉంటే ఎప్పడైనా కేసు నమోదు చేయొచ్చని తెలిపారు. తనను కొట్టిన వారిని గుర్తుపట్టలేకపోయినా చేయించింది మాత్రం జగన్, ఐపీఎస్ లు పీఎస్సార్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్ లే అన్నారు. అందుకే వారిపై గత నెల 10న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో పోలీసులు తాజాగా వీరిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications