ఎంపీ పదవికి రాజీనామా చేస్తా!: పవన్ వ్యాఖ్యలకు ధీటుగా మురళీ మోహన్ స్పందన
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని టీడీపీకి చెందిన రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి రాజమహేంద్రవరం నుంచి రామచంద్రాపురం మధ్య సరికొత్త బస్సు సర్వీస్ను ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీ మోహన్ తానేమీ రాజకీయాల్లో పదవులు పట్టుకు వేలాడే వ్యక్తిని కాదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు తాను కట్టుబడి ఉన్నానని, తన రాజీనామాతో హోదా వస్తుందంటే అందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఏపీకి హోదా సాధన దిశగా పవన్ కళ్యాణ్తో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ పదవి తనకు ముఖ్యం కాదని, అందరినీ కలుపుకుని ప్రత్యేకహోదా కోసం పోరాడతామని ఆయన అన్నారు.