విశాఖ ప్రత్యేక జోన్ పై రైల్వే జీఎంను నిలదీసిన టిడిపి ఎంపిలు...సమావేశం బహిష్కరణ
విజయవాడ:రైల్వే ప్రాజెక్టులపై తమ ప్రతిపాదనలు ఏవీ అమలు కాలేదని దక్షిణమధ్య రైల్వే మేనేజర్ ను టీడీపీ ఎంపీలు నిలదీశారు. విజయవాడలో జరిగిన రైల్వే జిఎం సమావేశంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన టిడిపి ఎంపీలు అనంతరం భేటీని బహిష్కరించారు.
అంతకుముందు దక్షిణమధ్య రైల్వే మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి టిడిపి ఎంపీలు హాజరయ్యారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించలేదని, ప్రాజెక్టుల్లో పురోగతి లేదంటూ టిడిపి ఎంపీలు సమావేశంలో నినాదాలు చేశారు. భేటీని బహిష్కరించి బయటకు వచ్చిన ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఏపీ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు సహా...ఎంపీల ప్రతిపాదనలను తీసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కొన్ని కీలక ప్రతిపాదనలను ఎంపీలు రైల్వే బోర్డుకు సమర్పించారు.
ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా సరిగ్గా బడ్జెట్ పేపర్లు సిద్ధమవుతున్న సమయంలో మీటింగ్ నిర్వహించిన సౌత్ సెంట్రల్ రైల్వే...తాజాగా మాత్రం ఏకంగా 4 నెలల ముందే సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి హాజరయ్యే ముందు విజయవాడలోని ఎంపీ కేశినేని నాని నివాసంలో టిడిపి ఎంపీలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, మాగంటి బాబు, కనకమేడల, నిమ్మల కిష్టప్ప, బుట్టా రేణుక హాజరయ్యారు. రైల్వే జిఎం సమావేశానికి హాజరై ఏపీ రైల్వేజోన్పై రైల్వే అధికారులను నిలదీయాలని ఈ సందర్భంగా ఎంపీలు నిర్ణయించారు. అలాగే నియోజకవర్గాల ప్రతిపాదనలు రైల్వే జీఎంకు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా టిడిపి ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, కేశినేని నాని, బుట్టా రేణుక, నిమ్మల కిష్టప్ప మీడియాతో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్పై సంతృప్తికర సమాధానం రాకపోతే రైల్వే జీఎంతో సమావేశాన్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామనే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వారు ఆరోపించారు.
ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ గత రైల్వే జీఎం సమావేశంలోనే విశాఖ రైల్వేజోన్ అంశాన్ని ప్రస్తావించినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. రైల్వేబోర్డుకు ఇచ్చిన ప్రతిపాదనలు ఏవీ అమలుకావడం లేదని, ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి రైల్వే జోన్ కావాలనేదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. రైల్వే జిఎంతో ఈ సమావేశంలో కూడా అదే అంశాన్నే ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. రైల్వేజోన్, ఆర్థికలోటు, దుగరాజుపట్నం, కడప స్టీల్ప్లాంట్పై నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని...కానీ.. ప్రధాని మోడీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసిందని ఎంపీ మాగంటి బాబు తెలిపారు.
మరోవైపు టిడిపి ఎంపీల నిరసనపై రైల్వే జిఎం వినోద్ కుమార్ స్పందించారు. ఎంపీలంతా విశాఖ రైల్వే జోన్ కోసం డిమాండ్ చేశారని...రైల్వేజోన్ సెంటిమెంట్...అని తాము అర్థం చేసుకున్నామన్నారు. రైల్వే ప్రాజెక్టులు, మౌలికవసతులు కల్పన వేగంగా జరుగుతోందని వెల్లడించారు. మూడేళ్లలో గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. జోన్ పరిధిలో ఆరు రైల్వే స్టేషన్లను డెవలప్మెంట్ చేస్తున్నామని...రూ.100 కోట్లతో నాలుగు స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 480 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ చేస్తామని, అమరావతికి రైల్వే అనుసంధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే జీఎం పేర్కొన్నారు.
Recommended Video













Click it and Unblock the Notifications