కేసులు పెరుగుతుంటే లాక్ డౌన్ ఎత్తేస్తారా ?- జగన్ ది అవగాహనా రాహిత్యమన్న టీడీపీ ఎంపీ..
ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14తో ముగుస్తున్న లాక్ డౌన్ గడువును పరిమిత ప్రాంతాల్లోనే పొడిగించాలని సీఎం జగన్ ప్రధానిని కోరడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం జగన్ చేసిన సూచనను తాము వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఇది అవగాహనా రాహిత్యమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
పరిమిత లాక్ డౌన్ ఎందుకు ?
కోవిడ్ తీవ్రత నేపథ్యంలో ప్రధాని మోడీ 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారని, అయినప్పటికీ కేసులు పెరుగుతున్నాయని టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాక్ డౌన్ ను ఎత్తివేసి కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని మోడీని జగన్ కోరడం అవగాహనారాహిత్యమని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణకు జగన్ ఇప్పటికైనా సీరియస్ స్టెప్స్ తీసుకోవాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయని,అమెరికాలో 5 లక్షల పాజిటివ్ కేసులు దాటాయని, వీటన్నింటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు సూచించారు.

జగన్ వ్యాఖ్యలు బాధాకరం..
ఇవాళ ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా బాధాకరమని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసి.. కొన్ని జోన్లకే పరిమితం చేయాలని జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని, 4,5 నెలల పాటు లాక్ డౌన్ లో ఉంటేనే కరోనాను అరికట్టగలమని పలు దేశాలు భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు.

ఒడిశాలో 50 కేసులు మాత్రమే ఉన్నప్పటికీ లాక్ డౌన్ ను కొనసాగించాలని అక్కడి ముఖ్యమంత్రి నిర్ణయించారని, కానీ మన రాష్ట్రంలో 400 కేసులు దాటినా 6గురు మరణించినా జగన్ అవగాహనారాహిత్యంతో కొన్ని జోన్ లకే లాక్ డౌన్ పరిమితం చేయాలని కోరడమేంటని రామ్మోహన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications