సభలో సమరం..టీడీపీ రివర్స్ వ్యూహం: ప్రయివేటు బిల్లు ప్రతిపాదన దిశగా..: రెబల్స్ కు విప్ జారీ..!
రాజధానుల వ్యవహారం పైన అధికార..ప్రతిపక్షాల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు సిద్దమవుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో రాజదానుల ప్రతిపాదన బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంత కు ముందే కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసి..అసెంబ్లీలో పెట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యూహాలకు ధీటుగా ప్రతిపక్ష టీడీపీ రివర్స్ వ్యూహం సద్దం చేస్తోంది.
అందులో భాగంగా.. మండలిలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్న టీడీపీ అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రయివేటు బిల్లు ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈ రోజు సమావేశం అవుతున్న టీడీపీ శాసనసభా పక్షం సభలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనుంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలతో పాటుగా రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరికీ విప్ లు జారీ చేసారు.
ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలి...
అమరావతి నుండి పాలనా వ్యవహారాలను ఇతర ప్రాంతాలకు తరలించటానికి వ్యతిరేకమని ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసింది. రాజధానుల విషయంలో ప్రభుత్వం సోమవారం కేబినెట్ లో బిల్లును ఆమోదించి ..శాసనసభలో ప్రవేశ పెట్టనుంది. మంగళవారం మండిలో ప్రతిపాదించాలని నిర్ణయించింది. అయితే, ప్రభుత్వ వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహలను అమలు చేయాలని టీడీపీ నిర్ణయించింది.
అందులో భాగంగా సభలో అనుసరించాల్సి వ్యూహాల పైన టీడీపీ శాసనసభా పక్షం సమావేశమవుతోంది. శాసనసభలో అధికారపక్షానికి భారీ మెజార్టీ ఉండటంతో..న్యాయ పరమైన అంశాలకు సమాధానం డిమాండ్ చేస్తూ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ భావిస్తోంది. సీఆర్డీఏ చట్టం విషయంలో ప్రభుత్వం తీరు టీడీపీ తన ప్రధాన అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది. దీని పైన సభ్యులకు అంశాల వారీగా మాట్లాడేలా బాధ్యతలు అప్పగిస్తున్నారు.
మండలిలో ప్రయివేటు బిల్లు పెట్టే దిశగా..
రాజధాని మార్పునకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ వ్యూహాన్ని శాసనమండలి లో ప్రతిఘటించాలని టీడీపీ భావిస్తోంది. దీనిపై తమ ఎత్తుగడలకు ఆ పార్టీ నేతలు పదును పెడుతున్నారు. బిల్లుల ఆమోదంలో అసెంబ్లీదే పైచేయి అయినప్పటికీ తన వ్యతిరేకతను తెలియజేయడానికి, కొంత జాప్యం చేయడానికి మండలికి అధికారం ఉంటుంది.శాసనసభలో ప్రతిపక్షంగా తమ వాద న వినిపించడం, మండలిలో వాదన వినిపించడంతో పాటు బిల్లులను నిలువరించే అంశాలను టీడీపీ పరిశీలిస్తోంది.
రాజధాని మార్పును ప్రభుత్వం నేరుగా తన బిల్లుల్లో ప్రస్తావించకపోవచ్చని, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో సూచనప్రాయంగా పేర్కొనే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో అమరావతికి మద్దతుగా మండలిలో టీడీపీ తమ సభ్యుల ద్వారా ప్రయివేటు బిల్లు ప్రతిపాదించే అంశాన్ని సైతం పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం రాజధాని అంశంలో బిల్లు కాకుండా తీర్మానమే ప్రతిపాదిస్తే..మండలిలో ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారింది.
వంశీ.. గిరిధర్కు విప్ జారీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్లకు టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ నుండి గెలిచినా..వారిద్దరు ప్రస్తుతం అధికార పార్టీకి దగ్గరయ్యారు. అయితే, ఇప్పుడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ విప్ జారీ చేసింది. ప్రస్తుతం ఆ ఇద్దరు అసెంబ్లీ రికార్డుల ప్రకారం సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అసెంబ్లీ ఓటింగ్ అవసరమైన సమయంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఓటింగ్ జరిగి ఇద్దరు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరిస్తే వారిపైన చర్యల దిశగా టీడీపీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గతంలో సభలో సీఎం చేసిన ప్రకటనను ప్రస్తావించి..వారి పైన తక్షణమే అనర్హత వేటు వేయించేలా వ్యవహరించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో...రెండు రోజుల పాటు సాగే అసెంబ్లీ..మండలి సమావేశాలు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.