ఆ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏం చేద్దాం ? టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ ?
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో కీలక భేటీ జరుగుతోంది. ఇందులో పార్టీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు పాల్గొంటున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇవాళ జరుగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో ప్రధానంగా వైసీపీ నాలుగేళ్ల పాలన, త్వరలో జరిగే మహానాడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దుల విజయాలు, సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఎలా వ్యవహరించారన్న అంశాలపై అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే 41 ఏళ్ల టీడీపీ ప్రస్ధానం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపైనా పొలిట్ బ్యూరో చర్చిస్తోంది.

టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసిన ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరి విషయంలో ఇకపై ఎలా వ్యవహరించాలి, వారి నియోజకవర్గాల్లో పరిస్ధితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఆయా సీట్లలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పొలిట్ బ్యూరో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునే అంశంపై ఎలా వ్యవహరించాలన్న దానిపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఈ ఏడాది మహానాడును రాజమండ్రిలో నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఉగాది నుంచి టీడీపీకి వరుస విజయాలు వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు రాజమండ్రి అయితే బావుంటుందని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications