చంద్రబాబును చూస్తే బాధేసింది-పోలీసులే చెత్తబండ్లనూ ఎత్తేస్తున్నారు-జేసీ కామెంట్స్..
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం టూర్ కు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడంపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆయన ఇవాళ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం కూడా కొరవడిందని జేసీ విమర్శించారు.
తాడిపత్రిలో ఇవాళ మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. చంద్రబాబు కుప్పం టూర్ పై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ప్రాణీ ఆలోచించాల్సిన పరిస్ధితి వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితి స్వాతంత్రోద్యమ కాలం నాటి రోజులు తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం కొరవడిందని, చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే అని, ఆయన నియోజకవర్గంలో ఆయన తిరగకూడదు అనడం ఏంటని జేసీ ప్రశ్నించారు. సీఎం వైఖరిని ప్రజలు కాదు కదా పక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదన్నారు.

వైసీపీ నేతలు మీడియా హక్కులను కూడా హరిస్తారని, మీడియా వారు ఆలోచించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. రోజురోజుకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తగ్గుతుంటే పోలీస్ వారు కండువాలు వేసుకొని కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. మునిసిపల్ ఛైర్మన్ గా సమావేశానికి ఆహ్వానం పంపించి ఉదయం 10:30 కి హౌస్ అరెస్ట్ అన్నారని, ఎందుకో అర్థం కావడం లేదన్నారు. మార్చి నెలలోపు లోకల్ చానెళ్లను , యూట్యూబ్ చానెళ్ళను కూడా ప్రభుత్వం నియంత్రిస్తుందన్నారు. చంద్రబాబుని చూస్తే బాధేసిందని, మిమ్మలని రక్షించడానికే బాబు అవస్థ పడుతున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెత్తబండ్లను కూడా పోలీసులే అడ్డుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో పోలీసులే చెత్త ఎత్తుతారేమో మమ్మల్ని ఎత్తకండి అని ప్రతిఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.












Click it and Unblock the Notifications