ఒక్కొక్కటిగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ-అమల్లోకి టీడీపీ వ్యూహం-వ్యతిరేకతతో వైసీపీ వెనక్కి ?
ఏపీలో ఒకప్పుడు తమిళనాడు అమ్మ క్యాంటీన్ల స్పూర్తితో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఆ తర్వాత తెరమరుగయ్యాయి. రాష్ట్రంలో అధికారం వైసీపీ చేతుల్లోకి వెళ్లడంతోనే అన్నక్యాంటీన్లకు మంగళం పాడేశారు. దీంతో అప్పటివరకూ రూ.5 రూ.10 రూపాయలకు భోజనం చేసిన పేదలంతా కడుపు పట్టుకుని తిరిగి హోటళ్లలో వందలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.ఇప్పటికే పలు చోట్ల ప్రారంభమైన అన్న క్యాంటీన్లు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో రెడీ అవుతున్నాయి.
అన్న క్యాంటీన్లతో రాజకీయం
రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తీసుకుంటున్నప్పటికీ పేదలు పేదలుగానే కనిపిస్తున్నారు. వీరిలో పట్టెడన్నం దొరకని పేదలు ఎంతోమంది ఉన్నారు. తక్కువ రేటుకు భోజనం పెట్టేవారు దొరకాలే కానీ అక్కడికి పరుగులు తీసేందుకు వారంతా సిద్ధంగానే ఉన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు కాస్తా వైసీపీ సర్కార్ రాగానే రాజకీయాల బారిన పడి మూతపడ్డాయి. దీంతో అప్పటివరకూ వీటిలో భోజనాన్ని తక్కువ ధరకే తిన్న పేదలంతా ఒక్కసారిగా హోటళ్లకు పరుగులు తీయాల్సి వచ్చింది. డబ్బులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు.
టీడీపీ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తిరిగి అన్న క్యాంటీన్లను పునరుద్దరించేందుకు టీడీపీ వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే గుంటూరు, మంగళగిరితో పాటు మరికొన్ని చోట్ల ఈ మధ్యే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అక్కడ రోజూ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు గతంలో ఇచ్చిన రూ.5 రూ.10 రేట్లకే భోజనం లభిస్తోంది. దీంతో పేదలకు కాస్త ఊరట లభిస్తోంది. అయితే గతంలో అన్న క్యాంటీన్లకు ఇచ్చిన భవనాలను ప్రభుత్వం కూల్చివేయడమో లేక స్వాధీనం చేసుకోవడమో జరిగిపోవడంతో చేసేది లేక టెంట్లు వేసి మరీ టీడీపీ నేతలు భోజనాలు పెడుతున్నారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.
అడ్డుకుంటున్న వైసీపీ
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు పలు చోట్ల వైసీపీ నేతలు పోలీసులతో కలిసి అడ్డంకులు కల్పిస్తున్నారు. దీంతో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే మంగళగిరితో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన క్యాంటీన్లకు పోలీసులు ఎన్నో ఇబ్బందులు సృష్టించారు. చివరికి అనుమతివ్వక తప్పలేదు. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. స్ధానికంగా పేదలు, అడుక్కునేవారు, విద్యార్ధులు వీటిపై మక్కువ చూపుతున్నారు. వారికి అన్నం పెట్టకుండా అన్న క్యాంటీన్లను అడ్డుకుంటే స్ధానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వైసీపీ నేతలు కూడా దూకుడుగా ముందుకెళ్లలేని పరిస్ధితి.
టీడీపీకి ఇదే ఛాన్స్ !
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు పలు చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా అంతిమంగా స్ధానికుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహంతో తెలుగు తమ్ముళ్లు, నేతలు ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నా అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం అనువైన స్ధలాలు చూసి టెంట్లు వేసి మరీ వీటిని పునరుద్ధరిస్తున్నారు. మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పాటైతే గతంలోలా అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. దీంతో జనం కూడా అన్న క్యాంటీన్లు ఉండాల్సిందేనంటున్నారు. ఇదే ఉత్సాహంతో త్వరలో మరిన్ని అన్న క్యాంటీన్లు పునరుద్దరిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.