జూ. ఎన్టీఆర్ వర్సెస్ రోహిత్: నారా లోకేష్ పొలిటిక్స్
హైదరాబాద్: తెలుగుదేశం యువనాయకత్వంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నారా కుటుంబానికి చెందిన తెలుగు సినీ హీరో రోహిత్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నారా రోహిత్ తెలుగుదేశం పార్టీ నాయకులను కలుస్తున్నారు కూడా. నారావారిపల్లెలో ఆయన సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కండువా కూడా వేసుకున్నారు.
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ స్థానాన్ని నారా రోహిత్తో భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ శనివారంనాడు కూడా చెప్పారు. కానీ, ఆయనను చంద్రబాబు దూరం పెట్టాలనే అనుకుంటన్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దూరమవుతున్న క్రమంలోనే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగులను, యువకులను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ రీతుల్లో యువతను పార్టీ గొడుగు కిందికి తేవడానికి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోగా నారా రోహిత్కు ఉన్న గ్లామర్ను కూడా ఆయన వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

నందమూరి హరికృష్ణ శనివారం తన తండ్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబుపై పరోక్షంగానే అయినా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలయ్యను బుట్టలో వేసుకోవడానికి రాజ్యసభ సీటు ఎర చూపుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ వైఖరిని కూడా ఆయన తప్పు పట్టారు. రాజ్యసభకు ఇద్దరిని పంపించడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది. దీంతో హరికృష్ణ స్థానంలో ఆయన సోదరుడు బాలకృష్ణను రాజ్యసభకు పంపించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్యను రాజ్యసభకు పంపించడం ద్వారా, హరికృష్ణను పక్కన పెట్టడం ద్వారా పార్టీ పగ్గాలను దాదాపుగా పూర్తి స్థాయిలో తన కుమారుడు నారా లోకేష్కు అప్పంగించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ను తిరిగి దగ్గరకు తీసుకునేందుకు ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. నిజానికి, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేరు. కానీ, నారా లోకేష్ చేతికి పార్టీ పగ్గాలు పోవడం జూనియర్ ఎన్టీఆర్కు గానీ హరికృష్ణకు గానీ ఇష్టం లేదని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ 2019నాటికి రాజకీయాల్లోకి వచ్చి తాత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈలోపల పూర్తి స్థాయిలో నారా లోకేష్కు పార్టీని అప్పగించాలనే వ్యూహంతో చంద్రబాబు పనిచేసుకుంటూ పోతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు అంతరంగం హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్కు తెలుసునని, అయినా గుంభనంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇస్తారనే ప్రచారం నారా లోకేష్కు పోటీ లేకుండా చేయాలనే చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతన్నట్లు భావిస్తున్నారు. ఇదే అభిప్రాయం హరికృష్ణకు కూడా ఉన్నట్లు సమాచారం. దానివల్లనే, తాను వైయస్సార్ కాంగ్రెసు చేరుతాననే తప్పుడు ప్రచారం సాగుతోందని హరికృష్ణ శనివారంనాడు అన్నారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా రసవత్తరమైన నాటకం నడుస్తోంది.












Click it and Unblock the Notifications