పయ్యావుల సంచలనం: పవన్ వల్ల టీడీపీకి ఓట్లు పెరగలేదు
హైదరాబాద్: మంగళవారం శాసనమండలిలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లగానీ, మరే ఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్లు శాతం పెరగలేదని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు.
మంగళవారం శాసనమండలిలో కరువుపై చర్చ జరిగిన సందర్భంలో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఛాయలు నెలకొన్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదని మండిపడ్డారు.
ఆ సమయంలో అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన సి. రామచంద్రయ్య జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కాళ్లు, మోడీ గడ్డం పట్టుకొని అధికారంలోకి వచ్చిన మీకు (టీడీపీ) ప్రజలు ఇబ్బందులు తెలుసుకొనే ఆసక్తి లేకపోవడం శోచనీయమన్నారు.
ఇదే సందర్భంలో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కలగజేసుకొని సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లగానీ, మరే ఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్లు శాతం పెరగలేదని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు.